కరీంనగర్, తేది: 12-06-2026
ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ, కార్మిక శాఖ, పోలీసు శాఖ, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సమన్వయంతో కరీంనగర్లో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.
జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి మరియు జిల్లా కార్మిక శాఖ అధికారి ప్రసాద్ జిల్లా పరిషత్ కార్యాలయం నుండి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ గీతాభవన్ చౌరస్తా వరకు కొనసాగింది. ర్యాలీ సందర్భంగా వివిధ దుకాణాలు, వాణిజ్య సంస్థలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి బాల కార్మికులు పనిచేస్తున్నారా అనే అంశాన్ని పరిశీలించారు.
బాల కార్మికులు లేని దుకాణాల యజమానులకు అవగాహన కల్పించి, "బాల కార్మికుల రహిత దుకాణం" స్టిక్కర్లను అంటించడం జరిగింది. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఎక్కడైనా బాల కార్మికులు కనిపించినట్లయితే వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్ 1098 కు సమాచారం అందించాలని అధికారులు సూచించారు.
ఈ కార్యక్రమంలో బాలల సంక్షేమ సమితి సభ్యులు రేండ్ల కళింగ శేఖర్, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ప్రతినిధి చంద్రప్రకాశ్ రెడ్డి, సీడీపీఓలు, చైల్డ్ హెల్ప్ లైన్ 1098 జిల్లా కోఆర్డినేటర్ సంపత్, బాలల పరిరక్షణ సిబ్బంది శాంత, తిరుపతి, కార్మిక శాఖ అధికారులు, పోలీసు టాస్క్ ఫోర్స్ సిబ్బంది మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.