కరీంనగర్లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
అభివృద్ధిలో కరీంనగర్ జిల్లా ఆదర్శంగా నిలుస్తుందని జిల్లా సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తున్నామని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు.
మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో మంగళవారం ఘనంగా నిర్వహించిన అధికారిక వేడుకల్లో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ, దివ్యాంగులు, వయోవృద్ధులు మరియు ట్రాన్స్జెండర్ల సాధికారత శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు, తెలంగాణ ఉద్యమకారులు, స్వాతంత్ర్య సమరయోధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అనంతరం ప్రజలనుద్దేశించి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రసంగిస్తూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. వారి త్యాగాలు, ఉద్యమకారుల పోరాటాలు, ప్రజల ఆకాంక్షల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని పేర్కొన్నారు.
12 ఏళ్ల తెలంగాణ ప్రస్థానం గర్వకారణం
2014 జూన్ 2న సాకారమైన తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నం నేడు అభివృద్ధి, సంక్షేమం, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవానికి ప్రతీకగా దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిందని మంత్రి అన్నారు. రాష్ట్ర సాధన కోసం పోరాడిన అమరవీరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు, ప్రతి తెలంగాణ బిడ్డకు కృతజ్ఞతలు తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శక పాలన అందిస్తూ తెలంగాణను దేశానికి ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతోం దని పేర్కొన్నారు.
‘తెలంగాణ రైజింగ్-2047’తో ప్రపంచ ఆర్థిక శక్తిగా రాష్ట్రం
తెలంగాణను ప్రపంచ స్థాయి ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం "తెలంగాణ రైజింగ్-2047" దిశానిర్దేశక పత్రాన్ని రూపొందించిందని మంత్రి తెలిపారు. పెట్టుబడులను ఆకర్షించడం, ఉపాధి అవకాశాల ను పెంచడం, సంపద సృష్టించడం, ఆ సంపదను ప్రజల సంక్షేమానికి వినియోగించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు.
ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక విజయవంతం
ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధిని ప్రతి ఇంటికి చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన "ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక" జిల్లాలో విజయవం తంగా అమలవుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 3,506 ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు.
2,913 పెండింగ్ ఫైళ్లను పరిష్కరించారు. జిల్లా యంత్రాంగం నిర్వహించిన మెగా జాబ్ మేళాలో 78 కంపెనీలు పాల్గొని 292 మందికి ఉద్యోగాలు కల్పించాయన్నారు.
మహాలక్ష్మి పథకంతో
మహిళలకు భారీ లబ్ధి
మహిళల ఆర్థిక సాధికారత కోసం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలు చేసిన 7.39 కోట్ల ఉచిత ప్రయాణాలకు గాను రూ.334 కోట్ల లబ్ధి చేకూరింద న్నారు. జిల్లాలో 1.58 లక్షల మంది లబ్ధిదారులకు 9.23 లక్షల గ్యాస్ సిలిండర్లను రూ.500కే అందించా మని పేర్కొన్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.29.78 కోట్లు వ్యయం చేసిందన్నారు.
గృహజ్యోతి పథకం ద్వారా
153 కోట్ల లబ్ధి
200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే కుటుంబాలకు గృహజ్యోతి పథకం కింద జీరో బిల్లులు అందిస్తున్నామని తెలిపారు. జిల్లాలో 1,73,627 మంది వినియోగదారులకు
రూ.153 కోట్ల లబ్ధి చేకూరింది.
రైతు భరోసా – రైతు బీమాతో రైతుకు అండగా ప్రభుత్వం
రైతుభరోసా పథకం ద్వారా:
1,93,544 మంది రైతులకు
రూ.143.35 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశారు.
రైతు బీమా పథకం ద్వారా:
మరణించిన 267 మంది రైతుల కుటుంబాలకు రూ.13.35 కోట్ల పరిహారం అందించామన్నారు.
ఇందిరమ్మ ఇండ్లతో పేదల సొంతింటి కల సాకారం
ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద:
10,114 మంది లబ్ధిదారులు ఎంపిక.. 7,076 ఇండ్లు నిర్మాణ దశలో 2,081 కుటుంబాలు గృహప్రవేశం చేసుకున్నట్లు మంత్రి వెల్లడించారు.
ధాన్యం కొనుగోళ్లలో రికార్డు..
యాసంగి సీజన్లో:
319 కొనుగోలు కేంద్రాల ద్వారా
2,90,885 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో రూ.554 కోట్లు జమ చేశామని మంత్రి పేర్కొన్నారు. అలాగే 23,710 మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేసినట్లు తెలిపారు.
సన్నబియ్యం పంపిణీ – రేషన్ కార్డుల మంజూరులో విశేష పురోగతి..
జిల్లాలో విద్యార్థులకు 279 మెట్రిక్ టన్నుల సన్నబియ్యంతో భోజనం
మధ్యాహ్న భోజన పథకానికి ప్రతి నెల 600 క్వింటాళ్ల సన్నబియ్యం
45,920 కొత్త రేషన్ కార్డులు మంజూరు.. 96,775 మంది కొత్త సభ్యుల చేర్పు 3.20 లక్షల కుటుంబాలకు ప్రతి నెల 6,021 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం పంపిణీ జరుగుతోందన్నారు.
మహిళా సంఘాలకు
వందల కోట్ల రుణాలు
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా 980 స్వయం సహాయక సంఘాలకు రూ.147 కోట్ల రుణాలు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 118 సంఘాలకు రూ.17.70 కోట్ల బ్యాంకు లింకేజీ
అందించగా, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా మహిళా సంఘాలకు రూ.3 కోట్ల రుణాలు అందించామ ని తెలిపారు.
పింఛన్లు – చీరల పంపిణీ – మత్స్యకారులకు ప్రోత్సాహం
1,33,293 మందికి ప్రతి నెల రూ.31.32 కోట్ల చేయూత పింఛన్లు.. 1.41 లక్షల మంది మహిళలకు ఉచిత చీరల పంపిణీ
స్వయం సహాయక సంఘాలకు రూ.10 లక్షల విలువైన మొబైల్ ఫిష్ రిటైల్ యూనిట్లు మంజూరు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.
విద్యారంగంలో అద్భుత ఫలితాలు
ఈ విద్యా సంవత్సరంలో:
13,137 మంది విద్యార్థులు ఎస్ఎస్సీ పరీక్షలు రాయగా
12,949 మంది ఉత్తీర్ణులు
98.57 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. అలాగే:
58 ప్రీ-ప్రైమరీ పాఠశాలలు ప్రారంభం సుమారు 1,000 మంది విద్యార్థులకు సమ్మర్ క్యాంపుల ద్వారా శిక్షణ అందించినట్లు చెప్పారు.
ఎస్సీ, బీసీ విద్యార్థులకు భారీ ప్రోత్సాహం
2,535 మంది ఎస్సీ విద్యార్థులకు హాస్టల్ ప్రవేశాలు 29,240 మంది బీసీ విద్యార్థులకు రూ.74.43 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు అందించినట్లు మంత్రి వెల్లడించారు.
కళ్యాణలక్ష్మి – షాదీ ముబారక్ ద్వారా వేలాది కుటుంబాలకు సహాయం..
1,836 మందికి కళ్యాణలక్ష్మి
458 మందికి షాదీ ముబారక్
పథకాల కింద ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు.
ఆరోగ్యశ్రీతో 52 వేల మందికి ఉచిత వైద్యం
రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా:
38 నెట్వర్క్ ఆసుపత్రుల్లో
52,116 మందికి ఉచిత శస్త్రచికిత్సలు ఇందుకోసం ప్రభుత్వం రూ.139 కోట్లు చెల్లించిందని చెప్పారు.
అంగన్వాడీల ద్వారా తల్లులు, పిల్లలకు పోషకాహారం
జిల్లాలోని 777 అంగన్వాడీ కేంద్రాల ద్వారా 7,579 మంది గర్భిణీలు, బాలింతలకు సంపూర్ణ భోజనం 46,069 మంది చిన్నారులకు బలవర్ధక ఆహారం అందిస్తు న్నామని తెలిపారు.వయోవృద్ధుల కోసం డే కేర్ సెంటర్, ట్రాన్స్జెండర్ల సంక్షేమం కోసం మైత్రి క్లినిక్ విజయవంతంగా పనిచేస్తున్నాయని వెల్లడించారు.
ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు
తెలిపిన మంత్రి
జిల్లా అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీసు సిబ్బంది, న్యాయాధి కారులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు, తెలంగాణ ఉద్యమ కారులు, జర్నలిస్టులు, జిల్లా ప్రజలందరికీ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ సీతా రామచంద్ర జిల్లా సమైక్య ప్రతినిధులకు స్వశక్తి మహిళా సంఘాలకు 116 కోట్ల 10 లక్షల రూపాయల విలువైన రుణాలకు సంబంధించిన చెక్కును మంత్రి ఎమ్మెల్యేలు కలెక్టరు అందించారు.
"అమరవీరుల ఆశయ సాధనే ప్రభుత్వ లక్ష్యం. ప్రజల సంక్షేమం, జిల్లా సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది" అని మంత్రి స్పష్టం చేశారు. అనంతరం వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టాళ్లను మంత్రి ఎమ్మెల్యేలు కలెక్టర్ పోలీస్ కమిషనర్ పరిశీలించారు. వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
వారి ప్రతిభను గుర్తిస్తూ అతిథులు జ్ఞాపకాలను అందించారు. అదేవిధంగా మంత్రి ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్ అమరవీరుల కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు. అమరవీరుల త్యాగాలను కొనియాడారు.
ఉద్యోగ నిర్వహణలో అత్యుత్తమ సేవలు అందించినందుకు పలువురు పోలీస్ అధికారులు వివిధ శాఖల అధికారులు సిబ్బందికి ప్రశంస పత్రాలు అందించారు. ఇంతకుముందు తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం తదితరులు నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ కమిషనర్ అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, శ్రీనివాస్ రెడ్డి, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేష్ ఆర్టిఏ మెంబర్ పడాల రాహుల్ డిప్యూటీ మేయర్ వై సునీల్ రావు కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న
పలువురు అధికారులు ప్రము ఖులు ప్రజా ప్రతినిధులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో..
జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయం లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ క్యాంప్ కార్యాలయ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్లో..
రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా కరీంనగర్ కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ శ్రీనివాస్ రెడ్డి జాతీయ
పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.