పెద్దపల్లి, జూన్ 01:
ముఖ్యమంత్రి ఓవర్సీస్ పథకం క్రింద స్కాలర్ షిప్/ఆర్థిక సహాయం కొరకు అర్హత కలిగిన మైనార్టీస్ విద్యార్థులు జూన్ 30లోగా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసి, జూలై 31లోపు ఆన్ లైన్ దరఖాస్తులను జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి కార్యాలయంలో సమర్పించాలని జిల్లా మైనార్టీస్ సంక్షేమ అధికారి పి.నరేష్ కుమార్ నాయుడు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ మైనారిటీ సంక్షేమ శాఖ డైరెక్టర్ అండ్ కమీషనర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లాలోని మైనారిటీ (ముస్లింలు, క్రిస్టియన్, సిక్కు, బౌద్ధ, జైన్ మరియు పార్శీ) విద్యార్థులకు ముఖ్యమంత్రి ఓవర్సీస్ పథకం క్రింద స్కాలర్ షిప్/ఆర్థిక సహాయం కొరకు, డిగ్రీ మరియు ఇంజనీరింగ్ లో 60 శాతం మార్కులు ఉండి పోస్టు గ్రాడ్యుయేట్ చేయుటకు మరియు పి.జి. లో 60 శాతం మార్కులు వచ్చి డాక్టరేట్ చదువుటకు 2026 జనవరి 1 నుండి జూన్ 30, 2026 వరకు విదేశీ యూనివర్సిటీలలో అడ్మిషన్ పొందిన మైనార్టీ విద్యార్థులు ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాలని తెలిపారు.
దరఖాస్తుదారుని కుటుంబ సంవత్సర ఆదాయం 5 లక్షల రూపాయల లోపు ఉండాలని, అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, న్యూజిలాండ్, దక్షిణ కొరియా దేశాలలోని యూనివర్సిటీలలో అడ్మిషన్ పొంది ఉండాలని, మిగతా అర్హత వివరాలకు వెబ్సైట్ చూడాలని సూచించారు. అర్హత కలిగిన మైనార్టీ విద్యార్థులు జూన్ 30, 2026 సాయంత్రం 5:00 గంటల లోపు www.telanganaepass.cgg.gov.in వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకొని, సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు మూడు జతల జిరాక్స్ ప్రతులను జూలై 31, 2026 సాయంత్రం 5:00 గంటల లోపు జిల్లా మైనారిటీస్ సంక్షేమ శాఖ, పెద్దపల్లి కార్యాలయంలో సమర్పించాలని కోరారు.
ఎంపికైన విద్యార్థులకు 20 లక్షల రూపాయల ఉపకార వేతనము/ఆర్థిక సహాయం రెండు విడతలలో మరియు 60 వేల రూపాయల వరకు విమాన చార్జీలు చెల్లించబడతాయని, ఈ అవకాశాన్ని అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా మైనార్టీస్ సంక్షేమ అధికారి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
--------------------------------------------------------------------------------------
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లి చే జారీ చేయనైనది.