జూన్ 01
జనగామ ధాన్యం తరలింపును వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సూచించారు.
సోమవారం, జిల్లాలోని లింగాల ఘనపురం మండలంలోని నెల్లుట్ల, నవాబుపేట, వడ్డిచర్ల గ్రామ పంచాయతీల పరిధిలో గల ఐకేపీ, పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సందర్శించి, ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటివరకు ఎన్ని లారీలు, ట్రాక్టర్లు ధాన్యం తరలించాయి? ఏ సమయంలో ఏ మిల్లుకు పంపించారు? ట్రక్ షీట్లో వివరాలు సక్రమంగా నమోదు చేశారా? అనే అంశాలపై ఆరా తీశారు. అలాగే ఇప్పటివరకు ఎన్ని ఓపీఎంఎస్ ఎంట్రీలు పూర్తి చేశారో కేంద్రాల నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎన్ని లారీలు, ట్రాక్టర్లు పంపించారో స్పష్టమైన రికార్డులు నిర్వహించాలని సూచించారు.
ప్రతి మిల్లుకు ఏ సమయానికి వాహనాలు బయలుదేరాయో, ఇప్పటివరకు మొత్తం ఎన్ని లారీలు, డీసీఎంలు, ట్రాక్టర్లు వెళ్లాయో, ట్రక్ షీట్లో నమోదు చేసిన వివరాలు సరిపోలేలా చూడాలని తెలిపారు. కేంద్రాల్లో ప్రస్తుతం ఎన్ని కళ్లాల్లో ధాన్యం నిల్వలో ఉందో, ఎన్ని వాహనాల ఎంట్రీలు నమోదయ్యాయో కూడా నిరంతరం నవీకరణ చేయాలని ఆదేశించారు.
కొనుగోలు ప్రక్రియలో ఎటువంటి వ్యత్యాసాలు లేకుండా అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు.
ధాన్యం నిల్వలు, కాంటా పూర్తయిన తర్వాత మిగిలి ఉన్న ధాన్యం బస్తాల వివరాలు, రిజిస్టర్ నిర్వహణ, తదితర అంశాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అలాగే ధాన్యం రవాణా ఆలస్యం కాకుండా ట్రక్కులు, డీసీఎంలు, ట్రాక్టర్ల ద్వారా వేగంగా తరలించాలని, లక్ష్యంగా నిర్ణయించిన రవాణా ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.
ధాన్యం నిల్వ కాకుండా కేంద్రాల నిర్వహణ సమర్థంగా ఉండాలని సూచించారు.
ఈ నేపథ్యంలో రైతులతో మాట్లాడిన కలెక్టర్, రైతుల ప్రయోజనాలే ధ్యేయంగా కొనుగోలు కేంద్రాల పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తూ వేగవంతమైన చర్యలు కొనసాగుతున్నాయని కలెక్టర్ హామీ ఇచ్చారు.