రాజన్న సిరిసిల్ల, మే -29 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ధాన్యం సేకరణ, అన్ లోడింగ్ వేగవంతం చేయడం, అపరల్ పార్క్, గోదాములు, రైస్ మిల్లుల్లో అన్ లోడింగ్, ఆన్ లైన్ ట్యాబ్ ఎంట్రీ ప్రక్రియ, తదితర అంశాలపై అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, పౌర సరఫరాలు, సహకార శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, మెప్మా, రవాణా, తదితర శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ శుక్రవారం ఉదయం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
జిల్లాలో నిన్నటివరకు 2 లక్షల 33 వేల 758 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని జిల్లా కలెక్టర్ వెల్లడించారు. కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు వర్షం కారణంగా ధాన్యం తడవకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామనే భరోసా క్షేత్ర స్థాయిలో కల్పించాలని సూచించారు.
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణలో మరింత వేగం పెంచాలని, అన్ లోడింగ్ ప్రక్రియ వేగవంతంగా సజావుగా పూర్తి చేయాలని సూచించారు.
కొనుగోలు కేంద్రాలలో ఉన్న హమాలీలను ధాన్యం అన్ లోడింగ్ వేగవంతం చేయడం కోసం అపరల్ పార్క్ కు తరలించాలని, తద్వారా వాహనాలు తొందరగా అన్ లోడింగ్ జరిగి అవసరమైన కేంద్రాలకు వాహనాలను పంపడానికి అవకాశం ఉంటుందని తెలిపారు.
ఆన్ లైన్ ట్యాబ్ ఎంట్రీ ప్రక్రియ పూర్తి చేసేలా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేయాలని అధికారులకు సూచించారు.
వాహనాల కొరత లేకుండా సరైన పర్యవేక్షణ చేయాలని, సంబంధిత ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్లు సరిపడా వాహనాలు సమకూర్చేలా చూడాలని సూచించారు. తుది దశలో ఉన్న కొనుగోలు కేంద్రాలకు వాహనాలను పెంచాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.