తంగళ్ళపల్లి, మే - 29 తడిసిన ధాన్యం సేకరణ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పేర్కొన్నారు.
తంగళ్ళపల్లి మండలం అంకుసాపూర్ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని క్షేత్ర స్థాయిలో సందర్శించారు. ఇప్పటివరకు సేకరించిన ధాన్యం, తూకం వేసి తరలించడానికి సిద్ధంగా ఉన్న బస్తాల వివరాలను కొనుగోలు కేంద్రం నిర్వాహకులను అడిగి ఆరా తీశారు.
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. ఈ సారి వరి దిగుబడి, కొనుగోలు కేంద్రాలకు రాక పెరిగిందని, జిల్లాలో నిన్నటివరకు 2 లక్షల 33 వేల 758 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని జిల్లా కలెక్టర్ వెల్లడించారు. ఇప్పటి దాకా 80 శాతం కొనుగోలు చేశామని తెలిపారు. డీఆర్డీఓ, సహకార శాఖ, మెప్మా, పౌర సరఫరాల శాఖ, రవాణా శాఖ ఇతర శాఖల అధికారుల సమన్వయంతో కొనుగోలు తుది దశకు చేరుకున్నాయని వెల్లడించారు. కొనుగోలు కేంద్రాలు ధాన్యం, గోదాముల్లో ధాన్యం అన్ లోడింగ్ వేగంగా పూర్తి చేసేలా మండలాలకు ప్రత్యేక అధికారులు, అన్ లోడింగ్ వద్ద అధికారులను నియమించి పర్యవేక్షణ చేస్తున్నామని తెలిపారు. కొనుగోళ్ల ప్రక్రియ పై ప్రతి రోజు ఉదయం అన్ని శాఖల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేస్తూ.. కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ వెల్లడించారు. సిరిసిల్ల, తంగళ్లపల్లి మండలాల్లో కొంత వర్షం కురిసిందని, దీంతో తాను తంగళ్ళపల్లి మండలం అంకుసాపూర్ గ్రామంలోని కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించానని పేర్కొన్నారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించాలని పౌర సరఫరాల శాఖ అధికారిని ఆదేశించారు. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అపరల్ పార్క్, గోదాములకు తరలించి.. అక్కడ అన్ లోడింగ్ చేయిస్తున్నామని, హమాలీలకు నీరు, ఆహారం అన్ని వసతులు కల్పిస్తున్నామని తెలిపారు
వర్షం కారణంగా తడిసిన ధాన్యం సేకరణ విషయంలో ఇబ్బందులు లేవని, రైతులు ఈ విషయంలో ఆందోళన చెందవద్దని కలెక్టర్ సూచించారు. తూకం వేసి ఉన్న ధాన్యం బస్తాలను తరలించడానికి వాహనాలను సమకూర్చాలని ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్లను ఆదేశించారు.
అన్ని శాఖల సమన్వయంతో జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ సజావుగా సాగుతుందని, సాధ్యమైనంత త్వరగా కొనుగోళ్ళు పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
పరిశీలనలో జిల్లా సహకార అధికారి రామకృష్ణ, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి బుచ్చిబాబు, మేనేజర్ నరసింహ తదితరులు పాల్గొన్నారు.