మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం అని ఘనపూర్ (స్టేషన్) శాసనసభ్యులు కడియం శ్రీహరి అన్నారు.
బుధవారం, జిల్లాలోని ఘనపూర్ (స్టేషన్) నియోజకవర్గంలోని రఘునాథపల్లి మండలంలోని అశ్వరావుపల్లి గ్రామంలోని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి సౌర విద్యుత్ ప్లాంట్ శిలాఫలకాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, గ్రంథాలయ ఛైర్మన్ మారుజోడు రాంబాబులతో కలిసి ముఖ్య అతిథిగా ఘనపూర్ (స్టేషన్) శాసనసభ్యులు కడియం శ్రీహరి హాజరై, ఇందిరా మహిళా శక్తి పథకం కింద నవ భారతి మండల మహిళా సమాఖ్యకు కేటాయించిన ఒక మెగా వాట్ సౌర విద్యుత్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఘనపూర్ (స్టేషన్) శాసనసభ్యులు మాట్లాడుతూ.. నవ భారతి మండల మహిళా సమాఖ్య సభ్యులను అభినందిస్తూ, మహిళల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
గతంలో మండల మహిళా సమాఖ్యకు ప్రభుత్వ సహకారంతో ఒక బస్సును కొనుగోలు చేసి, దానిని ఆర్టీసీకి అప్పగించడం ద్వారా ప్రతి నెల రూ. 69 వేల ఆదాయం పొందుతున్న విషయాన్ని గుర్తు చేశారు.
ఈ క్రమంలో ఇప్పుడు ఏర్పాటు చేయనున్న ఒక మెగా వాట్ సౌర విద్యుత్ ప్లాంట్ ద్వారా నెలకు లక్ష రూపాయల ఆదాయం సమాఖ్యకు సమకూరే అవకాశం ఉందన్నారు.
సుమారు రూ. 3 కోట్ల వ్యయంతో నిర్మాణం కానున్న ఈ సోలార్ ప్లాంట్ ద్వారా నాలుగు వేల యూనిట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి చేసి, విద్యుత్ సంస్థకు విక్రయించడం ద్వారా ఖర్చులు మినహాయించి, మహిళా సమాఖ్యకు నెలకు గణనీయమైన ఆదాయం లభిస్తుందని తెలిపారు. దీంతో మహిళల ఆర్థిక స్థిరత్వానికి తోడ్పడుతుందని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మహిళలను కేవలం సంక్షేమ పథకాల లబ్ధిదారులుగానే కాకుండా వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోందన్నారు.
మహిళలు తమ కుటుంబాలను పోషించడమే కాకుండా మరింత మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తోందని తెలిపారు.
ఇదే క్రమంలో గ్రామ మహిళా సమాఖ్యలకు ఎరువుల దుకాణాల నిర్వహణ బాధ్యతలు అప్పగించి, ఎరువులతో పాటు విత్తనాల విక్రయానికి కూడా అవకాశాలు కల్పించేందుకు జిల్లా స్థాయిలో చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, గృహ జ్యోతి పథకం ద్వారా ఉచిత విద్యుత్, రేషన్ ద్వారా సన్న బియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, ఆసరా పెన్షన్ల విస్తరణ వంటి కార్యక్రమాలు మహిళల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నాయని చెప్పారు.
అలాగే ఒంటరి మహిళలు, వితంతువులకు పెన్షన్లలో ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను మహిళా సంఘాలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా మరింత బలపడాలని పిలుపునిచ్చారు.
అదే విధంగా దేవాదుల ప్రాజెక్టు ద్వారా ప్రతి ఎకరానికి పంట సాగుకు నీరు అందించామని, చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని, అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని, రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని హామీ ఇచ్చారు.
అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళా సాధికారతను లక్ష్యంగా చేసుకుని ఏర్పాటు చేయనున్న సౌర విద్యుత్ ప్లాంట్ ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఇదే గ్రామానికి చెందిన కనీసం పది మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
సోలార్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు స్థిరమైన ఆదాయం అందించడంతో పాటు, వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచే దిశగా ఉపయోగపడుతుందన్నారు.
అదే విధంగా జిల్లాలో మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో ఎరువులు, విత్తనాల దుకాణాలను కేటాయించనున్నట్లు వెల్లడించారు. మహిళా సంఘాలకు ఆదాయ వనరులు పెరిగేలా ఈ చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.
ఇక మహిళల ఆర్థిక బలోపేతం కోసం జిల్లాలో మహిళా సమాఖ్యలకు పెట్రోల్ బంకుల నిర్వహణ బాధ్యతలను కూడా అప్పగించే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. మహిళల స్వయం సమృద్ధి సాధనలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
మహిళా సమాఖ్యలను కేవలం పొదుపు సంఘాలకే పరిమితం చేయకుండా, విద్యుత్ ఉత్పత్తి, వ్యవసాయ సేవలు, ఇంధన పంపిణీ వంటి రంగాల్లో భాగస్వామ్యం కల్పించడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మహిళల పాత్రను మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
తదనంతరం గ్రంథాలయ ఛైర్మన్ మాట్లాడుతూ.. మహిళలు ప్రతి రంగంలో ముందడుగు వేస్తూ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆర్థికంగా బలపడుతున్నారని, మహిళల సాధికారతను లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వారికి స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఆర్థిక స్వావలంబన దిశగా ప్రోత్సహిస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో డీఆర్డీవో భాస్కర్, ఏపిడి నూరుద్దీన్, రెడ్కో వరంగల్ జిల్లా మేనేజర్ మహేందర్ రెడ్డి, గ్రామ సర్పంచి చైతన్య, ఇతర సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, మండల సమాఖ్య అధ్యక్షురాలు, సభ్యులు, మహిళలు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.