రాజన్న సిరిసిల్ల, మే-23 జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవసరం ఉన్న చోట వాహనాల సంఖ్యను మరింత పెంచాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
ధాన్యం సేకరణ, తూకం వేసిన బస్తాల తరలింపు, వాహనాలు, హమాలీల సంఖ్య పెంచడం, మిల్లుల్లో ధాన్యం అన్ లోడింగ్, ఆన్ లైన్ ట్యాబ్ ఎంట్రీ వేగవంతం చేయడం, తదితర అంశాలపై శనివారం అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, పౌర సరఫరాలు, సహకార శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, మెప్మా, రవాణా తదితర శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
కొనుగోలు కేంద్రాల్లో గన్ని బ్యాగులు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. ఆయా కొనుగోలు కేంద్రాల్లో సిద్ధంగా ఉన్న ధాన్యం బస్తాల తరలింపునకు ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టర్లు వాహనాలు సమకూర్చేలా చూడాలని జిల్లా రవాణా శాఖ అధికారి ని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం లోడింగ్, అపరెల్ పార్క్, గోదాములు, రైస్ మిల్లుల్లో అన్ లోడింగ్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, హమాలీల సంఖ్య పెంచాలని సూచించారు. తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని, సేవలు అందించాలని ఆదేశించారు. ఆన్ లైన్ ట్యాబ్ ఎంట్రీ వేగవంతం చేసేలా పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.