రాజన్న సిరిసిల్ల, మే -19కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలింపు.. రైస్ మిల్లులు, గోదాముల్లో అన్ లోడింగ్ లో మరింత వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం తరలింపు, అన్ లోడింగ్, ఆన్ లైన్ ట్యాబ్ ఎంట్రీ, రైతులు, హమాలీలకు ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలు, తదితర అంశాలపై మంగళవారం ఉదయం అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ తో కలిసి పౌర సరఫరాల, సహకార శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, మెప్మా ఇతర శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తూకం వేయడం, తూకం వేసిన ధాన్యాన్ని నిర్దేశించిన
మిల్లులు, గోదాములకు తరలించడంపై అధికారులు దృష్టి సారించి, క్షేత్ర స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని, కొనుగోళ్ళ ప్రక్రియ సజావుగా పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు.
కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యం బస్తాలను తరలించేందుకు సరిపడా వాహనాలను ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు సమాకూర్చాలని స్పష్టం చేశారు.
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం లోడింగ్ కోసం, మిల్లులు, అపరల్ పార్క్ లో ధాన్యం అన్ లోడింగ్ చేయడం కోసం హమాలీల సంఖ్యను మరింత పెంచాలని సూచించారు.
ఎండ తీవ్రత దృష్ట్యా కొనుగోలు కేంద్రాల్లో రైతులు, హమాలీలు అలాగే అన్ లోడింగ్ చేసే మిల్లులు, గోదాముల్లో హమాలీలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని, తాగు నీరు, ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు అందుబాటులో పెట్టాలని సూచించారు. ఇంకా జిల్లాలో ఉన్న గోదాములను ధాన్యం అన్ లోడింగ్ చేసేందుకు సిద్ధం చేయాలని ఆదేశించారు.
రైతుల నుంచి సేకరించిన ధాన్యానికి సంబంధించిన ఆన్ లైన్ ట్యాబ్ ఎంట్రీ జాప్యం చేయవద్దని డీఆర్డీఓ, డీసీఓ, ఏవో మెప్మా, ఇతర అధికారులను ఆదేశించారు. ఆయా మండలాలకు చెందిన సంబంధిత అధికారులు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఆన్ లైన్ ట్యాబ్ ఎంట్రీ వేగవంతం చేసేలా పర్యవేక్షణ చేయాలని సూచించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలను సంబంధిత శాఖల అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు తప్పనిసరిగా తనిఖీలు చేస్తూ సూచనలు చేయాలని సూచించారు.