రాజన్న సిరిసిల్ల, మే -18కొనుగోలు కేంద్రాల్లో ధాన్యానికి అనుగుణంగా లారీల సంఖ్య పెంచాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం, వాహనాల ద్వారా ధాన్యం తరలింపు, హమాలీల సంఖ్య పెంపు, అన్ లోడింగ్ చేయడం, రైతులకు ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలు, తదితర అంశాలపై సోమవారం అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ తో కలిసి పౌర సరఫరాల, సహకార శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, రవాణా, మెప్మా అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ప్రతి రోజు ఉదయం 08.00 గంటలకు జిల్లా కలెక్టర్ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహిస్తున్నారు.
జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తూకం వేయడం, తూకం వేసిన ధాన్యాన్ని మిల్లులకు, గోదాములకు తరలించడంపై అధికారులు దృష్టి సారించి, క్షేత్ర స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని, కొనుగోళ్ళ ప్రక్రియ సజావుగా పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు.
కొనుగోలు కేంద్రాల నుంచి తూకం వేసిన ధాన్యం బస్తాలను తరలించేందుకు సరిపడా వాహనాలు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో డిమాండ్ కు అనుగుణంగా వాహనాలు సమకూర్చాలని సూచించారు.
రైస్ మిల్లులు, అపరల్ పార్క్ లో ధాన్యం అన్ లోడింగ్ చేయడం కోసం హమాలీల కొరత లేకుండా చూడాలని, డిమాండ్ కు అనుగుణంగా పెంచి, ఇబ్బందులు కలగకుండా పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు. హమాలీలకు భోజనం, వైద్య సేవలు అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
కొనుగోలు కేంద్రాలు, మిల్లుల వద్ద కేటాయించిన రెవెన్యూ, ఇతర శాఖల సిబ్బంది సమన్వయం చేసుకుని విధులు నిర్వర్తించాలని, క్షేత్ర స్థాయిలో ఏమైనా సమస్యలు తలెత్తితే వెంటనే జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.