రాజన్న సిరిసిల్ల, మే -15 విద్యార్థులందరూ గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు నిచ్చారు.
*ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక లో భాగంగా ఈ నెల 11 వ తేదీ నుంచి 17 వ తేదీ వరకు విద్యా వారోత్సవాల కింద రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గ్రంథాలయ దినోత్సవాన్ని శుక్రవారం నిర్వహించగా, ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా జయ జయహే తెలంగాణ పాటను వినిపించారు. లైబ్రరీ లో చదివి ఉద్యోగాలు సాధించిన వారిని సన్మానించారు.
ఈ సందర్భంగా గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన పుస్తకాలను పరిశీలించారు. పాఠశాలల విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక పుస్తక ప్రదర్శన, మానసిక ఉల్లాసానికి అందుబాటులో ఉంచిన వివిధ ఆటల పరికరాలను పరిశీలించి.. విద్యార్థులు ఈ పుస్తకాలు, ఆటల పరికరాలను సద్వినియోగం చేసుకునేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి మార్చి 6వ తేదీన ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. ఇందులో భాగంగా జూన్ 12వ తేదీ వరకు 10 శాఖల ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు, చెత్తాచెదారం తొలగింపు పనులు చేయించామని వివరించారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వారోత్సవాల సందర్భంగా రెసిడెన్షియల్ విద్యాలయాల్లో విద్యార్థులకు వైద్య పరీక్షలు, ఆరోగ్య అవగాహన సదస్సులు చేపట్టామని వెల్లడించారు. ఆరు రకాల ప్రత్యేక వైద్య నిపుణులతో రోగ నిర్ధారణ పరీక్షలు, సేవలు అందించామని తెలిపారు. పోలీస్, రవాణా శాఖ ఆద్వర్యంలో డ్రైవర్లకు వైద్య పరీక్షలు, కంటి పరీక్షలు చేయించామని పేర్కొన్నారు.
మూడేండ్ల వయసు, అలాగే ఆరేండ్లలోపు పిల్లలు తమ సమీపంలోని అంగన్వాడీ కేంద్రంలో నమోదు కావాలని సూచించారు. కోడి గుడ్లు, బాలామృతం, ఇక్రిశాట్ వారి సూచనల మేరకు రూపొందించిన స్నాక్స్, పాలు పోషకాహారం సద్వినియోగం చేసుకోవాలని పిలుపు నిచ్చారు.
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ..
జిల్లా కేంద్ర గ్రంథాలయంలో చాలా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపు నిచ్చారు. లైబ్రరీ అనేది చదువుకునేందుకు మంచి అవకాశమని, మిగతా వారితో పోటీ పడే స్పూర్తి పొందుతారని పేర్కొన్నారు. తాను కూడా లైబ్రరీలో చదివానని గుర్తు చేశారు. పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న అభ్యర్థులు వార్త పత్రికలు చదవాలని సూచించారు. దీంతో అన్ని విషయాలపై అవగాహన వస్తుందని వివరించారు. సమయం చాలా విలువైందని, సోషల్ మీడియా కు దూరంగా ఉంటూ లక్ష్య సాధన పై దృష్టి సారించాలని సూచించారు. ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని, ప్రతి సబ్జెక్ట్ కు నిర్ణీత గడువు పెట్టుకొని చదవాలని తెలిపారు. పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న వారు ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు. సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని సూచించారు. ఏదైనా కొలువు సాధించాలని ఆకాంక్షించారు.
స్కూల్ వెళ్ళే విద్యార్థులు లైబ్రరీకి వచ్చేలా వివరించాలని పేర్కొన్నారు. వచ్చే వారం యూత్ అండ్ పర్యాటక శాఖ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ప్రత్యేక వాకథాన్, జాబ్ మేళా నిర్వహించ నున్నామని వెల్లడించారు. యువత పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపు నిచ్చారు.
కంప్యూటర్ శిక్షణ కేంద్రంలో పరిశీలన
జిల్లా కేంద్ర గ్రంథాలయంలో టాస్క్ ఆద్వర్యంలో కొనసాగుతున్న కంప్యూటర్ శిక్షణ తరగతులను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పరిశీలించారు. ఎంత మంది విద్యార్థులు వస్తున్నారు? ఏ ఏ అంశాలు నేర్చుకుంటున్నారో ఆరా తీశారు. తరగతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
గ్రంథాలయాల సంస్థ జిల్లా చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం కృషితో గ్రంథాలయాలను అభివృద్ధి బాటలో తీసుకు వెళుతున్నామని తెలిపారు. గ్రంథాలయంలో చదువుకొని దాదాపు 150 మంది వరకు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారని వెల్లడించారు. చాలా గ్రామాల్లో పబ్లిక్ రీడింగ్ రూమ్ లను ఏర్పాటు చేసి గ్రామీణ పాఠకులకు గ్రంథాలయాలను అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూప, జిల్లా విద్యాధికారి జగన్ మోహన్ రెడ్డి, వార్డు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.