పెద్దపల్లి, మే-13 ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి , అందిస్తున్న నాణ్యమైన విద్య ఫలాలు 100 శాతం ప్రజలకు చేరేలా స్థానిక ప్రజాప్రతినిధులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష కోరారు.
99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రాణాలకు కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న విద్యా శాఖకు సంబంధించిన కార్యక్రమాలు పై సర్పంచులు, కార్పొరేటర్లు, మున్సిపల్ కౌన్సిలర్లతో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, గత రెండేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. కొత్త తరగతి గదుల నిర్మాణం, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం, విద్యుత్ సమస్యల పరిష్కారం, పెయింటింగ్ తదితర పనులు చేపట్టామని చెప్పారు.
ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చిన మార్పు స్పష్టంగా కనిపిస్తోందని, రాబోయే 5 నుండి 10 సంవత్సరాల వరకు ఉపయోగపడే విధంగా మౌలిక వసతులు సృష్టిస్తున్నామని అన్నారు.
ప్రభుత్వ విద్యాసంస్థల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను స్థానిక ప్రజాప్రతినిధులు క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని కోరారు. పనుల నాణ్యతను కాపాడేలా చూడాలని, స్థానిక అవసరాలకు అనుగుణంగా అవసరమైన మార్పులు సూచించవచ్చని తెలిపారు.
మౌలిక వసతుల అభివృద్ధితో పాటు పిల్లల విద్యా నాణ్యత పెంపుపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టామని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించే తల్లిదండ్రుల-ఉపాధ్యాయుల సమావేశాల్లో ప్రజాప్రతినిధులు పాల్గొనాలని సూచించారు.
డ్రాప్ అవుట్లు, తరచూ గైర్హాజరు అయ్యే విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించి వారు క్రమం తప్పకుండా పాఠశాలకు వచ్చేలా చూడాలని తెలిపారు.
ఉపాధ్యాయుల హాజరులో పారదర్శకత కోసం పెద్దపల్లి జిల్లా రాష్ట్రంలోనే మొదటిసారిగా FRS విధానాన్ని అమలు చేసిందని తెలిపారు.
ప్రతి ఉపాధ్యాయుడు ఎలా బోధిస్తున్నారు, పిల్లలకు అంశాలను సులభంగా ఎలా అర్థమయ్యేలా చెబుతున్నారు అనే అంశాల వరకు పర్యవేక్షిస్తున్నామని చెప్పారు.
ఇటీవల నిర్వహించిన సర్వేలో బోధన నాణ్యతలో పెద్దపల్లి జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిందని కలెక్టర్ తెలిపారు.
ప్రభుత్వం చేస్తున్న కృషి ప్రస్తుతం సుమారు 60 శాతం మందికి మాత్రమే చేరుతోందని, స్థానిక ప్రజాప్రతినిధులు కూడా చురుకుగా భాగస్వామ్యం అయితే నాణ్యమైన విద్య ఫలాలు 100 శాతం ప్రజలకు చేరుతాయని అన్నారు.
అధికారులు అన్ని వివరాలు అందిస్తారని, స్థానిక ప్రజాప్రతినిధులు క్రమం తప్పకుండా పాఠశాలలను సందర్శించి బోధన విధానం, విద్యార్థుల్లో నైపుణ్యాల అభివృద్ధి ఎలా జరుగుతోందో పరిశీలించి సూచనలు ఇవ్వాలని కోరారు. కేవలం మౌలిక వసతులపైనే కాకుండా విద్యా ప్రమాణాలపై కూడా సమీక్ష చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి శారద, అకాడమిక్ మానిటరింగ్ అధికారి పీఎం. షేక్ ,సెక్టోరియల్ ఆఫీసర్ మల్లేశం, జిసిడిఓ కవిత, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి, పెద్దపల్లిచే జారీ చేయనైనది