సిరిసిల్ల, మే -08రైస్ మిల్లుల్లో ధాన్యం అన్ లోడింగ్ వేగవంతం చేయాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని, సరిపడా టార్పాలిన్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆదేశించారు.
శుక్రవారం కోనరావుపేట మండల కేంద్రం, ఎగ్లాస్ పూర్ గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను, నాగారం, కనగర్తి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను, కొలనూర్ గ్రామంలోని మారుతి రైస్ మిల్లును, కనగర్తి గ్రామంలోని సరస్వతి, కనకదుర్గ రైస్ మిల్లులను అదనపు కలెక్టర్ తనిఖీ చేసి, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు, రైస్ మిల్లుల యజమానులకు పలు సూచనలు చేశారు.
కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీసుకువచ్చే ధాన్యాన్ని జాప్యం చేయకుండా తూకం వేయాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో అన్ని కొనుగోలు కేంద్రాల్లో సరిపడా టార్పాలిన్లు అందుబాటులో ఉండేలా చూడాలని, రైతులకు క్షేత్ర స్థాయిలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు సూచించారు. రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలని అన్నారు. సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు తరలించడానికి సంబంధిత కాంట్రాక్టర్లతో మాట్లాడి వాహనాలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలను, మిల్లులను అధికారులు పర్యవేక్షించాలని, క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు ఎదురైతే వెంటనే జిల్లా యంత్రాంగానికి సమాచారం అందించాలని అదనపు కలెక్టర్ సూచించారు.
కొనుగోలు కేంద్రాల నుండి రైస్ మిల్లులకు వాహనాల ద్వారా తరలించిన ధాన్యం బస్తాలను వేగంగా దింపుకొని, తిరిగి వాహనాలను కొనుగోలు కేంద్రాలకు పంపించేలా చూడాలని రైస్ మిల్లర్ల యజమానులను అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆదేశించారు.
మిల్లులకు వచ్చిన ధాన్యం అన్ లోడ్ చేయడంలో జాప్యం జరుగుతుందని, దీని వల్ల కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన బస్తాలు ఎక్కువ సంఖ్యలో నిల్వ ఉంటున్నాయని అన్నారు. హమాలీల సంఖ్యను పెంచుకుని అన్ లోడింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించారు.
తనిఖీలో కోనరావుపేట తహసీల్దార్ వరలక్ష్మి, నాయబ్ తహసీల్దార్ ప్రవీణ్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.