బోయినపల్లి/వేములవాడ, మే -06
జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు లారీల సంఖ్యను పెంచాలని కాంట్రాక్టర్ ను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
బోయినపల్లి మండలం కొదురుపాక గ్రామం, వేములవాడ అర్బన్ మండలం అనుపురంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ బుధవారం పరిశీలించారు.
ఇప్పటిదాకా ఎంత ధాన్యం వచ్చింది? ఎంత కొనుగోలు చేశారు? రైస్ మిల్లులకు ఎంత తరలించారు? తదితర విషయాలపై ఆరా తీశారు
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకానికి అనుగుణంగా లారీలు సమకూర్చాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు. రైతులకు వసతులు కల్పించాలని నిర్వాహకులకు సూచించారు. అకాల వర్షాలు కురిసే ప్రమాదం ఉందని, ధాన్యం తడవకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. నిబంధనలకు అనుగుణంగా ధాన్యం కొనుగోలు చేయాలని తెలిపారు.
హమాలీల సంఖ్య పెంచాలి
బోయినపల్లి మండలం జెగ్గారావుపల్లి గ్రామంలోని సుహాస్ రైస్ మిల్లును జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం నిలువలు, అన్ లోడింగ్ ప్రక్రియను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. రైస్ మిల్లర్లు హమాలీల సంఖ్య వెంటనే పెంచాలని, కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే ధాన్యాన్ని వేగంగా అన్ లోడింగ్ వేగంగా చేయించాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఆన్లైన్ ఎంట్రీని పూర్తి చేయాలని సూచించారు. పౌర సరఫరాల శాఖ అధికారులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరించిన రైతుల ఖాతాల్లో డబ్బులు వేగంగా జమ అయ్యేలా చూడాలని ఆదేశించారు.
లారీల ట్రాన్స్పోర్ట్ లు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యానికి అనుగుణంగా వాహనాలను సమకూర్చాలని ధాన్యం తరలింపులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు.
సమావేశంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ఎల్ బుచ్చిబాబు, మేనేజర్ నరసింహ, జిల్లా సహకార అధికారి రామకృష్ణ, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, తహసీల్దార్ షరీఫుద్దిన్ తదితరులు పాల్గొన్నారు.