మంథని, మే-06: 99 రోజుల ప్రజా పాలన కార్యక్రమంతో పెండింగ్ సమస్యల పరిష్కారం అవుతాయని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.
బుధవారం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్షలతో కలిసి మంథని ఆర్ఆర్ గార్డెన్, గంగాపురిలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు 5 నెలలు పూర్తైన సందర్భంగా ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కింద 99 రోజుల కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల నుండి ఫీడ్బ్యాక్ సేకరించి ప్రభుత్వ పథకాల అమలును మరింత మెరుగుపరచడమే లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ 99 రోజుల కార్యక్రమంలో మహిళా సంక్షేమం, విద్యుత్, పౌర సరఫరాలు వంటి అన్ని శాఖలు ప్రజల వద్దకు వెళ్లి పెండింగ్ దరఖాస్తులను పరిష్కరిస్తాయని తెలిపారు. మంథని నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో సుమారు 26 వేల పేద కుటుంబాలు గృహ జ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పొందుతున్నాయని, ఎవరైనా మిగిలి ఉంటే 99 రోజులలోనే వారికి జీరో బిల్లులు వచ్చేలా జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రతి పేద కుటుంబానికి రేషన్ ద్వారా 6 కిలోల సన్న బియ్యం అందిస్తున్నామని, ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షలకు పెంచామని తెలిపారు. ఆదవి సోమనపల్లిలో 25 ఎకరాల్లో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం చేపడుతున్నామని, మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల సౌకర్యాలు మెరుగుపడ్డాయని పేర్కొన్నారు.
నాలుగు మండలాల్లో 18 వేల మంది రైతులు ఎకరాకు రూ.6 వేల రైతు భరోసా పొందుతున్నారని, గత ప్రభుత్వ ఆర్థిక లోపాలను సరిదిద్దుతూ కూడా సంక్షేమ పథకాలను ఆపకుండా అమలు చేస్తున్నామని తెలిపారు.మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తున్నామని, దీనివల్ల మహిళల ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని తెలిపారు.
మంథనిలో టాస్క్ అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కేంద్రం ద్వారా యువతకు పరిశ్రమలకు అవసరమైన ఆధునిక నైపుణ్యాలు అందిస్తామని, బీటెక్, ఐటీఐ, డిగ్రీ విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. అలాగే మహిళల కోసం కుట్టు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, వారి ఆదాయాన్ని పెంచేందుకు గంగాపురిలో రూ.7.30 కోట్లతో గార్మెంట్ యూనిట్కు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. ఇది పూర్తయిన తర్వాత 400 మంది మహిళలకు ఉపాధి లభిస్తుందని, 4 నెలల్లో పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా గృహ రహిత పేదలకు ఇళ్లు అందిస్తున్నామని, రాబోయే మూడు సంవత్సరాల్లో ప్రతి అర్హుడికి ఇల్లు కల్పిస్తామని తెలిపారు. రేషన్ కార్డులు, గృహ జ్యోతి, రూ.500 గ్యాస్ సిలిండర్ వంటి పథకాలలో మిగిలిన అర్హులందరికీ జూన్ 2 లోపు లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు.
పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ, గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో జరగని అభివృద్ధిని గత రెండు సంవత్సరాల్లో గణనీయంగా సాధిస్తున్నామని తెలిపారు. గతంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ సరిగా జరగలేదని, ప్రస్తుతం ప్రజా పాలనలో నాణ్యమైన ఇందిరమ్మ ఇళ్లను గ్రామ స్థాయి వరకు అందిస్తున్నామని పేర్కొన్నారు. గతంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని, ప్రస్తుతం అర్హులైన కుటుంబాలకు రేషన్ కార్డులతో పాటు సన్న బియ్యం అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని, మంథని వంటి ప్రాంతాలకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను తీసుకువచ్చినట్లు తెలిపారు.
జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేయడమే కాకుండా ప్రజల నుండి ఫీడ్బ్యాక్ సేకరించి వాటి అమలును మెరుగుపరుస్తోందని తెలిపారు. 99 రోజుల కార్యక్రమం ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తూ, వారి సమస్యలను వేగంగా పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో సురేష్, మున్సిపల్ చైర్మన్ వి. శ్రీనివాస్, మినిమమ్ వేజెస్ బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్, కాచే శశి భూషన్, ఏఎంసీ చైర్మన్ కె. వెంకన్న, ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
-------------------------------------------------------------------------------------------------------------------------
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లిచే జారీ చేయనైనది.