రాజన్న సిరిసిల్ల, మే - 01
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక లో భాగంగా ఈ నెల 2 వ తేదీన శనివారం జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గ స్థాయి సభల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
ఈ నెల 2 వ తేదీన శనివారం నియోజకవర్గ స్థాయి సభల నిర్వహణపై అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్ వివిధ శాఖల జిల్లా అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ శుక్రవారం సమీక్షించారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా సభను ఏర్పాటు చేయాలని సూచించారు.
ఆరు గ్యారంటీలు. వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలతో కరపత్రం రూపొందించాలని, దానిని కార్యక్రమంలో అందజేయాలని తెలిపారు.
మంత్రి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు సంబంధిత శాఖల అధికారులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, యువత, రైతులు, వివిధ పథకాల లబ్ధిదారులను ఆహ్వానించాలని ఆదేశించారు. అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
సభలు తెలంగాణ రాష్ట్ర గీతం (జయ జయహే తెలంగాణ) స్వాగతోపన్యాసం, పరిచయం అలాగే సీఎం గారి సందేశం వినిపించాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకాలు రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,రూ.500 కే సబ్సిడీ గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి (200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, సన్న రకం వరికి బోనస్, చేయూత పెన్షన్లు, కళ్యాణలక్ష్మి / షాదీ ముబారక్, ఇందిరా మహిళా శక్తి బ్యాంక్ లింకేజీ, వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ చీరలు, కొత్త రేషన్ కార్డుల లబ్ధిదారుల వివరాలు,
సాధించిన విజయాలపై శాఖల ద్వారా సమాచారం ఇవ్వాలని, లబ్ధిదారుల పేర్లను చదవాలని, లబ్ధిదారుల అభిప్రాయాలు, అనుభవాలు చెప్పాలని తెలిపారు. ఇప్పటి దాకా అమలు చేస్తున్న వాటిపై చర్చించాలని, భవిష్యత్లో చేపట్టనున్న పనులపై తీర్మానాలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
సమావేశంలో హౌసింగ్ పీడీ వెంకట మాధవ రావు, డీఆర్డీఓ గీత, సీపీఓ శ్రీనివాసాచారి, జిల్లా పంచాయతీ అధికారి షరీఫ్ఫుద్దిన్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా తదితరులు పాల్గొన్నారు.