----------------------------
బసవేశ్వర ఆశయాలను, ఆలోచనలను మనమందరం ఆచరిస్తే సమాజంలో సమానత్వం సాధ్యమవుతుందని అదనపు కలెక్టర్ డి. వేణు అన్నారు.
సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా బీసీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బసవేశ్వర జయంతి వేడుకల్లో అదనపు కలెక్టర్ డి. వేణు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి, బసవేశ్వరుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అదనపు కలెక్టర్ డి. వేణు మాట్లాడుతూ, బసవేశ్వరుడు సమాజంలో ఉన్న కుల వ్యవస్థ, అసమానతలు తొలగించేందుకు కృషి చేసిన గొప్ప సంస్కర్త అని తెలిపారు. “కాయకవే కైలాసం” అనే సిద్ధాంతంతో ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని, శ్రమకు గౌరవం ఇవ్వాలని బోధించారని పేర్కొన్నారు.
సమాజంలో సమానత్వం, న్యాయం స్థాపన కోసం బసవేశ్వరుడు అనుభవ మంటపాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు స్వేచ్ఛగా అభిప్రాయాలను వ్యక్తం చేసే వేదిక కల్పించారని తెలిపారు. మహిళలకు సమాన హక్కులు కల్పించేందుకు కృషి చేయడంతో పాటు, విద్య, ఆధ్యాత్మికత ద్వారా సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆయన సూచించారని చెప్పారు.
సమాజంలోని ప్రతి వర్గం అభివృద్ధి చెందాలంటే బసవేశ్వరుని ఆలోచనలు ఎంతో అవసరమని, ఆయన చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ అభివృద్ధి అధికారి వినోద్ కుమార్, బీసీ అభివృద్ధి శాఖ అధికారులు, సిబ్బంది, ఇతర జిల్లా అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లిచే జారీ చేయనైనది