రైతును రాజు చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు.
ఎస్డీఎఫ్ నిధులు రూ.31 లక్షలతో ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామంలో నిర్మించిన ఉప కార్య నిర్వహక ఇంజనీర్, ఇరిగేషన్ సబ్ డివిజన్ నెంబర్ - 4 కార్యాలయ భవనాన్ని సోమవారం ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ లను పూర్తి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారని వివరించారు. సాగు అభివృద్ధి పనులు చేయిస్తున్నారని పేర్కొన్నారు. నీటి పారుదల ప్రాజెక్ట్ ల పనులు వేగంగా పూర్తి చేసేందుకు .. రైతులకు ఉత్తమ సేవలు అందించేందుకు ప్రభుత్వం నీటి పారుదల శాఖకు భవనాలు నిర్మిస్తుందని తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి, సంక్షేమ పనులు ప్రజల్లోకి తీసుకువెళ్లడం, భవ్యిషత్ ప్రణాళికలు రచించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని అమలు చేస్తుందని తెలిపారు. ఇప్పటికే జిల్లాలో పారిశుధ్య పనులు, రెసిడెన్షియల్ విద్యార్థులు, ప్రజలకు ప్రత్యేక వైద్య పరీక్షలు చేయించామని, అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహించామని వెల్లడించారు. ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి.. సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, జిల్లా నీటి పారుదల శాఖ అధికారి కిశోర్ కుమార్, మండల ప్రత్యేక అధికారి, జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి రాఘవేందర్, తహసీల్దార్ ఫరూఖ్, ఎంపీడీవో లచ్చాలు, సర్పంచ్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.