రోడ్ ప్రమాదాల సమయంలో డ్రైవర్లు 'గోల్డెన్ అవర్' మీద పూర్తి అవగాహన కలిగి ఉండాలని, క్షతగాత్రులకు అవసరమైన చికిత్స అందించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
అన్నారు.
ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పోలీస్, రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న 'అరైవ్ - అలైవ్' కార్యక్రమం నేపథ్యంలో శుక్రవారం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో "గోల్డెన్ అవర్" అంశంపై డ్రైవర్ లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి డీసీపీ రాజ మహేంద్ర నాయక్ తో కలిసి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు భయపడి అక్కడి నుంచి వెళ్లిపోకుండా, బాధితులను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రమాదం జరిగిన వెంటనే 108 అంబులెన్స్కు ఫోన్ చేసి, దగ్గరలోని ఆసుపత్రికి క్షతగాత్రులను తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
రోడ్డు ప్రమాదాల్లో “గోల్డెన్ అవర్ (Golden Hour)” ఎంతో కీలకమని, ఆ సమయంలో సరైన చికిత్స అందితే ప్రాణాలను కాపాడే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు.