రోడ్డు ప్రమాదాల నివారణకు అందరం కృషిచేద్దామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే పేర్కొన్నారు.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గురువారం అరైవ్ - అలైవ్ కింద రోడ్ సేఫ్టీ పై అవగాహన సదస్సును రోడ్డు రవాణా శాఖ ఆధ్వర్యంలో తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణ కాలనీలో వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించారు.
దీనికి ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ హాజరై మాట్లాడారు. రోడ్డు భద్రత నిబంధనలు పాటించకపోవడం ప్రమాదాలకు ముఖ్య కారణమని పేర్కొన్నారు.
డ్రైవర్లు తప్పనిసరిగా కంటి పరీక్షలు, శారీరక పరీక్షలు చేసుకోవాలని సూచించారు.
గడువు దాటిన వాహనాలను రోడ్లపైకి రాకుండా చూడాలని రవాణాశాఖ అధికారులకు సూచించారు. డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తూ మద్యం తాగి వాహనాలు నడపకుండా చూడాలని పోలీస్ అధికారులు సూచించారు. వాహనదారులు బాధ్యతగా హెల్మెట్, సీటు బెల్ట్ ధరించాలన్నారు.
రోడ్డు ప్రమాదం జరిగిన గోల్డెన్ అవర్ (ఆస్పత్రికి తీసుకెళ్లే) లోపు చేయాల్సిన ప్రాథమిక చికిత్స పై ప్రజలకు అవగాహన పెంచాలని అధికారులను ఆదేశించారు.
మన పరిధిలో రోడ్డు ప్రమాదాలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు.
ఆర్టీసీ ఆర్ఎం రాజు మాట్లాడుతూ.. మనదేశంలో ఏటా రెండు లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని పేర్కొన్నారు. సురక్షిత ప్రయాణం కోసం ఆర్టీసీ బస్సుల్లో వెళ్లాలని వివరించారు.
రవాణా శాఖ ఉప కమిషనర్
పెద్దింటి పురుషోత్తం మాట్లాడుతూ.. అతివేగం, అజాగ్రత్త, నిద్రలేమి, మైనర్లు వాహనాలు నడపడం కారణంగానే రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయన్నారు.
ఎదిగిన పిల్లలు కళ్ళముందే చనిపోతే తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నిబంధనలు పాటిస్తూ ప్రమాదరహిత తెలంగాణకు కృషి చేయాలన్నారు.
డిఎంహెచ్ఓ వెంకటరమణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సీపీఆర్, ప్రథమ చికిత్స పై అవగాహన పెంచుకోవాలని సూచించారు.
ఆర్టిఏ మెంబర్ పడాల రాహుల్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాద బాధితుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రహవీర్ పథకానికి శ్రీకారం చుట్టాయన్నారు.
ఆరోగ్యశ్రీ వర్తించే అన్ని ఆసుపత్రుల్లో రహవీర్ కింద రూ. లక్షన్నర వరకు వైద్య సహాయం అందిస్తారని వివరించారు. క్షతగాత్రులను ఆస్పత్రుల్లో చేర్చిన వారికి రహవీర్ కింద 25 వేల బహుమతి అందిస్తారని తెలిపారు.
తల్లిదండ్రులకు రోడ్డు భద్రతా నిబంధనలను విద్యార్థులు వివరించాలని సూచించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నాటిక ఆకట్టుకుంది. అనంతరం విద్యార్థులు, శాఖల అధికారులతో రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా వైద్యులు సిపిఆర్ చేసే విధానం చేసి చూపించారు.
డ్రైవర్లకు సన్మానం
రోడ్డు ప్రమాదాలు జరగకుండా
వాహనాలు నడిపిన జిల్లాలోని ఆర్టీసీ, లారీడ్రైవర్లతో పాటు ప్రైవేటు విద్యాసంస్థల డ్రైవర్లను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో డీటీవో శ్రీకాంత్ చక్రవర్తి, ఆర్డీవో మహేశ్వర్ జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి అనిల్ ప్రకాష్, వాగేశ్వరి ఇంజనీరింగ్ కాలేజ్ సెక్రటరీ గండ్ర శ్రీనివాస్ రెడ్డి డైరెక్టర్ వినోద్ స్థానిక సర్పంచ్ గుజ్జుల శ్వేతా రెడ్డి, రోడ్డు రవాణా శాఖ , వైద్య , ఆర్ అండ్ బి అధికారులు, ఇతరులు పాల్గొన్నారు.