సురక్షిత ప్రయాణానికి కంటి చూపు ప్రధానమని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు.
99 రోజుల ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా నిర్వహిస్తున్న అరైవ్ - అలైవ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలో గల గ్రేయిన్ మార్కెట్ పరిధిలో యార్డు డ్రైవర్ లకు, అలాగే అన్ని రకాల వాహనాల డ్రైవర్ లకు కంటి పరీక్షల శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి డీసీపీ రాజ మహేంద్ర నాయక్ తో కలిసి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. పోలీస్, రవాణా శాఖ సమన్వయంతో ఈ అరైవ్ - అలైవ్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున విజయవంతంగా కొనసాగుతూ, మంచిగా నిర్వహిస్తున్నారని అభినందించారు.
జిల్లాలో రెండు
నేషనల్ హైవేలు ఉన్నందున వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని, వయసు పెరిగే కొద్దీ వచ్చే కంటి సమస్యలను గుర్తించి, ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోవాలన్నారు.
కంటి చూపు బాగా ఉంటేనే సురక్షిత ప్రయాణం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకోవాలని, ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు.
ప్రజలు ఆరోగ్యంగా, సురక్షితంగా, ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. అలాగే వాహనదారులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అనంతరం డీసీపీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు బయటకు వెళ్లిన తర్వాత సురక్షితంగా ఇంటికి చేరుకోవడం అత్యంత ముఖ్యమని తెలిపారు.
హెల్మెట్ వినియోగం, సీటు బెల్ట్ ధరించడం తప్పనిసరి అని, మద్యం సేవించి వాహనం నడపకూడదని హెచ్చరించారు. లైసెన్స్ ఉన్నవారే వాహనం నడపాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు, జైలు శిక్షలు కూడా విధించడం జరుగుతుందని తెలిపారు.
రోడ్డు భద్రత కమిటీలు ఏర్పాటు చేసి ప్రజల్లో అవగాహన పెంచుతున్నామని చెప్పారు. ప్రమాదాలను తగ్గించేందుకు ప్రత్యేక చర్యలతో పాటు కంటి పరీక్ష శిబిరాలు (Eye Camp) నిర్వహించడం జరుగుతుందని, కంటి చూపు ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత ముఖ్యమని, ముఖ్యంగా వాహనదారులు ప్రతి 6 నెలలకు ఒకసారి కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అవసరమైన వారు కచ్చితంగా కళ్లజోళ్లు ఉపయోగించాలని, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని కోరారు.
అనంతరం జిల్లా కలెక్టర్... స్వయం గా డ్రైవర్ లకు అక్షరాలను గుర్తించడం లో ఉన్న
కంటి సామర్ధ్యన్ని పరిశీలించారు
ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ గౌడ్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి మల్లిఖార్జున రావు, స్థానిక సిఐ రెడ్డి, కౌన్సిలర్ రజని, పెద్ద సంఖ్యలో డ్రైవర్ లు, తదితరులు పాల్గొన్నారు.