బుధవారం, జిల్లాలోని కొడకండ్ల మండలంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సందర్శించి, ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.
ఈ సందర్భంగా కార్యాలయంలో నిర్వహిస్తోన్న వివిధ సేవలు, దస్త్రాల నిర్వహణ, హాజరు పట్టికలు, తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించారు.
ప్రతి దరఖాస్తుల పరిష్కారంలో ఆలస్యం జరగకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
రికార్డు రూంను తనిఖీ చేసి, రెవెన్యూ రికార్డుల నిర్వహణ, ఆన్లైన్ సేవల అమలు వంటి అంశాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు.
పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని సూచించారు.
కార్యాలయంలో పరిశుభ్రత చర్యలు పాటించాలని, రికార్డుల సంరక్షణపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
ప్రజలకు పారదర్శకంగా, వేగవంతంగా సేవలు అందించాలని తెలిపారు.
అనంతరం కొడకండ్ల మండలంలోని ఎంపిడిఓ కార్యాలయంలో ఈ నెల 16న జరిగే మండల సభల నిర్వహణపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమావేశం ఏర్పాటు చేసి, సమీక్షించారు.
ఈ నేపథ్యంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. మండల స్థాయిలో ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని, వెంటనే పరిష్కరించేందుకు మండల సభలు ముఖ్య వేదికగా నిలుస్తాయని కలెక్టర్ తెలిపారు.
సభను సమర్థవంతంగా నిర్వహించాలని, సభకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన మైక్ నిర్వహణ, మౌలిక సదుపాయాల ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ముఖ్యంగా సన్నబియ్యం, రేషన్, గృహ నిర్మాణాలు, తదితర అంశాలపై వచ్చిన ఫిర్యాదులను ప్రాధాన్యతతో పరిష్కరించాలని పేర్కొన్నారు.
అలాగే సభల నిర్వహణలో సమయపాలన పాటిస్తూ, అందిన ప్రతి అర్జీని నమోదు చేయాలని తెలిపారు.
మండల స్థాయి అధికారులు సమన్వయంతో పని చేసి సభను విజయవంతం చేయాలని సూచించారు.
ఈ తనిఖీలో, సమావేశంలో గృహ నిర్మాణ పీడీ మాతృ నాయక్, బీసీ సంక్షేమ శాఖ అధికారి ఎన్. ఎల్. నరసింహ రావు, ఎంపిడిఓలు నాగశేషాద్రి సూరి, వెంకటేష్, తహసీల్దార్ లు అనిల్ బాబు, ఇతర సంబంధిత అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.