అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని, ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అర్జీలను పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ డి.వేణు సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా అదనపు కలెక్టర్ డి.వేణు సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు.
ధర్మారం మండలం కట్కనపల్లి గ్రామానికి చెందిన ఎం.డి.ఖాసిం గ్రామ శివారులో సర్వే నెంబర్ 1211/2 లోని 14 గుంటల భూమి ఆన్ లైన్ లో వేరే పెరు మీద ఉందని, అది తమ పేరు పై మళ్లీ రిజిస్టర్ చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా తహసిల్దార్ ధర్మారం కు రాస్తూ విచారణ చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ తెలిపారు.
పెద్దపల్లి మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన గండు రాజయ్య వీ.ఎస్.బి బ్రిక్స్ నుండి దుమ్ము ధూళి బూడిద తమ వ్యవసాయ భూమిలోకి వచ్చి కూరగాయల తోటలో పంట నష్టం కలుగుతుందని చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా తహసిల్దార్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు.
జూలపల్లి మండలం కుమ్మంకుంట గ్రామానికి చెందిన తమ్మననేని మధుకర్ యాదవ్ తమకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్లలో రేకుల షెడ్డు నిర్మాణానికి అనుమతించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా పిడీ హౌసింగ్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.
ప్రజావాణి కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లి చే జారీ చేయనైనది.