ఫూలే స్ఫూర్తితో సమాజాభివృద్ధికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు.
శనివారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే 200వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫూలే చిత్రపటానికి కలెక్టర్ జ్యోతి వెలిగించి, పుష్పాంజలి ఘటించి, ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. మహాత్మా జ్యోతిరావు ఫూలే సమాజంలో సమానత్వం, విద్యా విస్తరణ, మహిళా సాధికారత కోసం చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు అందరికీ ఆదర్శంగా నిలుస్తాయన్నారు.
ప్రతి ఒక్కరూ విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు.
సమాజంలో వివక్ష లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించడమే ఆయన ఆశయమని గుర్తుచేశారు.
అనంతరం డీసీపీ రాజ మహేంద్ర నాయక్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోమ్, అధికారులు, కుల సంఘాల ప్రతినిధులు, సిబ్బంది కూడా ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులు సమర్పించారు.
ఈ కార్యక్రమంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి ఎన్. ఎల్. నరసింహ రావు, ఏబీసీడీఓ రవీందర్, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సిద్దయ్య గౌడ్, పండుగ హరీశ్, చిర్రా వీరస్వామి, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు వేముల బాలరాజు, యాదవ సంఘం జనరల్ సెక్రటరీ మేకల సమ్మయ్య, గంటె ఉపేందర్ యాదవ్, సేవాదళ్ టౌన్ ప్రెసిడెంట్ బిర్రు సత్యనారాయణ, విశ్వబ్రాహ్మణ సంఘం జనరల్ సెక్రటరీ కృష్ణ మూర్తి, కురుమ సంఘం జనరల్ సెక్రటరీ మల్లేష్, రెడ్ క్రాస్ అధ్యక్షులు కన్నా పరశురాములు, విశ్వకర్మ సంఘం జిల్లా ప్రెసిడెంట్ రామేశ్వరాచారి, నరసింహ చారి, టీకేవీఎస్ వైస్ ప్రెసిడెంట్ అభినాష్ నంద, బీసీ జేఏసీ కో - కన్వీనర్ మంగళంపల్లి రాజు, కేజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ వెంకట మల్లయ్య గౌడ్, దిశ సభ్యులు బక్క శ్రీనివాస్, బీసీ వసతి గృహాల అధికారులు, బీసీ శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.