పాలకుర్తి, ఏప్రిల్ 08: 04:2026
వచ్చే ఖరీఫ్ నాటికి గ్రామంలో అదనంగా 150 ఎకరాల్లో ఆయిల్ పామ్ నాటడమే లక్ష్యంగా పని చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు.
బుధవారం పాలకుర్తి మండలం ఈసాల తక్కలపల్లి గ్రామంలో ఆయిల్ పామ్ పంట సాగు పై నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, ఆయిల్ పామ్ పంట రైతులకు దీర్ఘకాలికంగా అధిక ఆదాయం అందించే లాభదాయక పంటగా నిలుస్తుందని తెలిపారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలను వినియోగించుకొని రైతులు ఆయిల్ పామ్ సాగును విస్తరించాలని సూచించారు.
గ్రామంలో సుమారు 150 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగుకు రైతులు సిద్ధంగా ఉన్నప్పటికీ, గత రెండు సంవత్సరాలుగా వివిధ కారణాల వల్ల నాటడం జరగలేదని తెలిపారు. వచ్చే ఖరీఫ్ సీజన్లో ఈ 150 ఎకరాల్లో తప్పనిసరిగా కొత్తగా ఆయిల్ పామ్ నాటేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
గ్రామంలో ప్రస్తుతం 210 మంది రైతులు 312 ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారని పేర్కొంటూ, ఆయిల్ పామ్ నాటిన మొదటి మూడు సంవత్సరాల్లో మధ్యంతర పంటగా పత్తిని సాగు చేసి అదనపు ఆదాయం పొందవచ్చని రైతులకు సూచించారు.
రైతులకు తక్కువ ఖర్చుతో డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేయడానికి జిల్లా పరిపాలన ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. రైతుల అందరికీ విద్యుత్ సరఫరా కల్పించబడుతుందని, 40 శాతం వ్యయాన్ని భరించే రైతులకు బోర్వెల్లు ఏర్పాటు చేయడానికి కూడా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆయిల్ పామ్ పంటకు ఎకరాకు నాలుగు సంవత్సరాలపాటు సుమారు రూ.52 వేల విలువైన సబ్సిడీ ప్రభుత్వం అందిస్తున్నదని తెలిపారు.
ఈ సందర్భంగా ఆయిల్ పామ్ పంటకు మొదటి విడతగా లబ్ధి పొందిన రైతులు స్వప్న, చంద్రయ్యలకు రూ.43 వేల విలువైన చెక్కులను జిల్లా కలెక్టర్ అందజేశారు.
పంట సాగులో శాస్త్రీయ పద్ధతులు అనుసరించడం, నాణ్యమైన మొక్కలను మాత్రమే నాటడం, నీటి నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని తెలిపారు. అలాగే రైతులకు అవసరమైన సాంకేతిక మార్గదర్శకాలు, అవగాహన కార్యక్రమాలు క్రమం తప్పకుండా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
మండల స్థాయిలో సాగు పురోగతిని నిరంతరం పరిశీలిస్తూ, సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా హార్టికల్చర్ అధికారి జగన్మోహన్ రెడ్డి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లి చే జారీ చేయనైనది