విద్యుత్ రంగంలో పనిచేసే ప్రతి ఉద్యోగి భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని, భద్రతా పరికరాలు వినియోగించడం కచ్చితంగా పాటించాల్సిన నియమమని ఎన్పీడీసీఎల్ సి.ఈ (ఆపరేషన్) శ్రీ అశోక్ స్పష్టంగా పేర్కొన్నారు. సిరిసిల్ల సర్కిల్ పరిధిలో శనివారం నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన, విద్యుత్ భద్రత, వినియోగదారుల సేవలు, వ్యవస్థ మెరుగుదలపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా విద్యుత్ ఉద్యోగులు, O&M (ఆపరేషన్ & మెయింటెనెన్స్) సిబ్బందికి భద్రతపై అవగాహన కల్పించేందుకు “పెప్ టాక్” కార్యక్రమం నిర్వహించబడింది. డివిజనల్ ఇంజనీర్ అంజయ్య ఆధ్వర్యంలో 33/11 కెవి శివనగర్ సబ్స్టేషన్లో ఈ కార్యక్రమం జరిగింది. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది హెల్మెట్, హ్యాండ్ గ్లౌజ్, ఎర్త్ రాడ్ వంటి భద్రతా పరికరాలు తప్పనిసరిగా ధరించాలని, వాటిని లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు చేయరాదని ఆయన గట్టిగా హెచ్చరించారు.
“ప్రాణం అమూల్యమైనది – ఉద్యోగుల భద్రత మా అగ్రప్రాధాన్యత” అని సి.ఈ అశోక్ స్పష్టం చేశారు. ప్రతి రోజు ఉదయం సెక్షన్ కార్యాలయాల్లో “పెప్ టాక్” నిర్వహిస్తూ సిబ్బందికి భద్రతపై నిరంతర అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ప్రతి ఉద్యోగి జీవితం విలువైనదని, భద్రతా ప్రమాణాలు కచ్చితంగా పాటించాల్సిన బాధ్యత అందరిదని అన్నారు.
వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందించడంలో O&M విభాగం కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. వినియోగదారులతో సత్సంబంధాలు కొనసాగిస్తూ, వారి సంతృప్తే ప్రధాన లక్ష్యంగా సేవలు అందించాలని సూచించారు. విద్యుత్ సేవల్లో సమూల మార్పులు తీసుకువచ్చే దిశగా సంస్థ కట్టుబడి ఉందని తెలిపారు.
“పొలం బాట – ప్రజా బాట” కార్యక్రమంతో రైతులకు చేరువ
సిరిసిల్ల పరిధిలో రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కరించేందుకు “పొలం బాట – ప్రజా బాట” కార్యక్రమాన్ని ఎస్.ఈ బిక్షపతి నాయకత్వంలో విస్తృతంగా నిర్వహిస్తున్నామని సి.ఈ అశోక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రైతులు, వినియోగదారులు పాల్గొని తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.
ముస్తాబాద్ మండలంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రైతులతో నేరుగా మాట్లాడిన అధికారులు, సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. క్షేత్రస్థాయిలో ప్రమాదకరంగా ఉన్న లూజ్ లైన్లు, వంగిన స్థంబాలు, తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్ఫార్మర్లు వంటి సమస్యలను ప్రాధాన్యంగా గుర్తించి తక్షణమే సరిచేస్తామని హామీ ఇచ్చారు.
వినియోగదారులు ఎట్టి పరిస్థితుల్లోనూ స్వయంగా విద్యుత్ పనులు చేయకూడదని, ఏ సమస్య ఉన్నా వెంటనే విద్యుత్ సిబ్బందిని సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.
బోయినపల్లి సెక్షన్ కొత్తపేట, సిరిసిల్ల టౌన్-1 బోనాల, టౌన్-2 మారుపాక, వల్లంపట్ల, వేములవాడ వల్మిడి, వీర్నపల్లి గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి, రైతులకు విద్యుత్ భద్రత, వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగిస్తూ వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించడం తమ ప్రధాన కర్తవ్యమని పేర్కొన్నారు.
ముస్తాబాద్ సబ్స్టేషన్ తనిఖీ – సాంకేతిక మెరుగుదలపై దృష్టి
ముస్తాబాద్ 33/11 కెవి సబ్స్టేషన్ను సి.ఈ అశోక్ స్వయంగా తనిఖీ చేశారు. ట్రాన్స్ఫార్మర్లు, స్విచ్ యార్డ్, నిర్వహణ విధానాలు, భద్రతా చర్యలు, విద్యుత్ సరఫరా నాణ్యత, సాంకేతిక పనితీరును సమగ్రంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ:
ఓవర్లోడ్ ఫీడర్లు ఉన్నచో వెంటనే లోడ్ బదలాయింపు చేపట్టాలని,
అవసరమైన చోట కొత్త బ్రేకర్లు ఏర్పాటు చేయాలని,
విద్యుత్ సరఫరా నాణ్యతను మెరుగుపరచేందుకు సాంకేతిక చర్యలు తీసుకోవాలని,
అవసరాన్ని బట్టి పవర్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచాలని అధికారులకు సూచించారు.
విద్యుత్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా, సురక్షితంగా, వినియోగదారులకు అనుకూలంగా తీర్చిదిద్దే దిశగా ఎన్పీడీసీఎల్ కట్టుబడి ఉందని సి.ఈ అశోక్ తెలిపారు.