మానవ సేవే మాధవసేవ అని.. కానీ మానసికంగా, శారీరకంగా వైకల్యం కలిగిన విద్యార్థులకు సేవ చేస్తే మనిషికి గొప్ప ఆత్మ సంతృప్తి కలుగుతుందని తెలంగాణ రాష్ట్ర మీడియా ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీ మహాత్మా నగర్ లో స్వాతంత్ర్య సమరయోధుల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేధో దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల 36వ వార్షికోత్సవం శనివారం నిర్వహించారు. దీనికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై.. ట్రస్ట్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డి, ట్రస్టు సభ్యులతో కలిసి జ్యోతి వెలిగించి కార్యక్రమం ప్రారంభించారు.
ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జన్యు లోపాలతో మేధోపరమైన వెనుకబాటుతనం కలిగిన బాల బాలికల కోసం స్వాతంత్ర్య సమరయోధులు ముందు చూపుతో పాఠశాల ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. కెవి నర్సింగరావు ఆధ్వర్యంలో ఈ పాఠశాల ఏర్పాటు చేసిన స్వాతంత్ర్య సమర యోధులకు కృతజ్ఞతలు తెలిపారు. చుట్టుపక్కల ప్రజలకు ఈ పాఠశాల దేవాలయంగా వెలసిల్లుతుందన్నారు. అంగ వైకల్యం ఒక ఎత్తు.. మానసిక వైకల్యం ఒక ఎత్తని..
ఈ పాఠశాలలో పిల్లల బాగోగులు, సంరక్షణ బాధ్యతలు చూస్తున్న టీచర్లు, ఆయాలు, సిబ్బందిని దేవుళ్ళుగా అభివర్ణించారు.
చాడ వెంకటరెడ్డి తో తనకు దశాబ్దాలుగా అనుబంధం ఉందని.. ఈ పాఠశాలను తనకున్న పరిచయాలతో మరింత అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షల కేటాయించిందని.. తనవంతుగా పాఠశాలకు అన్ని విధాలుగా సహకారం అందిస్తానని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి ఈ పాఠశాలను తీసుకెళ్లి.. వారు సందర్శించేలా కృషి చేస్తానని వివరించారు.
అక్కడి పాఠశాల విద్యార్థి విస్తరాకుల తయారీతో రోజుకు 500 సంపాదిస్తూ.. మూడు లక్షలు తన బ్యాంకు ఖాతాలో జమ చేసుకోవడం అభినందనీయం అన్నారు.
మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పాఠశాల అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు.
ట్రస్ట్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ
1990లో ఈ పాఠశాల ప్రారంభమైతే తాను 1996లో ట్రస్ట్ సభ్యుడిగా జాయిన్ అయినట్లు వివరించారు. ఎస్సారెస్పీ అధికారులతో మాట్లాడి రెండు ఎకరాల భూమి కేటాయించినట్లు గుర్తు చేశారు. దాతలు, సహకారంతో పాఠశాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు.
2004లో నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 25 లక్షలతో పాఠశాల భవనాలను నిర్మించినట్లు వెంకట్ రెడ్డి గుర్తు చేశారు. సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రెటరీ అనిత రామచంద్రన్ ఐఏఎస్ చొరవ శ్రీనిధి సహకారంతో రూ.26 లక్షల బస్సును కేటాయించినట్లు వివరించారు. మంత్రులు సీతక్క, లక్ష్మణ్ కుమార్ , దాతలు పాఠశాల అభివృద్ధికి సహకారం అందిస్తానని హామీ ఇచ్చినట్లు వివరించారు.
ఈ పాఠశాల అభివృద్ధి వెనుక అనేకమంది పాత్ర సహకారం ఉందన్నారు.
నాప్కో సీఈఓ రాజు పాఠశాల అభివృద్ధికి ఏటా సహకారం అందిస్తున్నట్లు వివరించారు. ఎల్ వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.
అవసరమైన వారికి పరికరాలు అందిస్తున్నట్లు తెలిపారు.
*స్వయం ఉపాధికి చర్యలు
ఇక్కడి పాఠశాలలో 18 ఏళ్లు దాటిన విద్యార్థుల నైపుణ్యాలు వెలికి తీసేందుకు కొవ్వొత్తులు, వి స్తరాకులు, సరుపు తయారీ యూనిట్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు.
ఇక్కడి విద్యార్థుల స్థితిని బట్టి స్పీచ్ తెరపి ఫిజియోథెరపీ, పర్సనల్ స్కిల్స్, అకాడమిక్ స్కిల్స్, యోగ నేర్పిస్తున్నట్లు వివరించారు.
20 మందితో ప్రారంభమైన ఈ పాఠశాల లో ప్రస్తుతం 127 మంది ఉన్నారని తెలిపారు. 77 మంది వసతిగృహంలో ఉండగా 50 మంది డేస్కాలర్ విద్యార్థులు ఉన్నట్లు వివరించారు.
విద్యార్థులు మానసికంగా అభివృద్ధి చెందేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమానికి రాలేకపోయినా తెలంగాణ పరిశ్రమల శాఖ కమిషనర్ నిఖిల్ చక్రవర్తి పంపిన సందేశాన్ని కరీంనగర్ పరిశ్రమల జిఎం సాల్మన్ రాజ్ చదివి వినిపించారు.
రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు సదానందం గౌడ్ మాట్లాడుతూ ఇలాంటి పాఠశాలల ను రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు ఒకటి చొప్పున ఏర్పాటు చేయాలని కోరారు.
ఆర్డీవో మహేశ్వర్ మాట్లాడుతూ ఇక్కడి పాఠశాలలోని విద్యార్థులను తమ కాళ్లపై తాము నిలబడేలా తీర్చిదిద్దుతున్నoదుకు సిబ్బందిని అభినందించారు.
సీనియర్ జర్నలిస్ట్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ఈ పాఠశాలకు తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
ట్రస్టీ బి. వెంకటయ్య మాట్లాడుతూ ఈ పాఠశాలను 15 మంది విద్యార్థులతో కిరాయి ఇంట్లో ప్రారంభించినట్లు వివరించారు.
ఈ పాఠశాలకు ప్రతి సంవత్సరం తనవంతుగా 20,000 అందిస్తానని చీఫ్ ఇంజనీర్ సుమతి దేవి ప్రకటించారు.
అనంతరం కార్యక్రమానికి హాజరైన అతిథులను నిర్వాహకులు సన్మానించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ సతీష్, ఐజేయు సెంట్రల్ ఈసీ మెంబర్ శేఖర్, ట్రస్టు సభ్యులు సత్యనారాయణ, అశోక్, తదితరులు పాల్గొన్నారు.