జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
గురువారం, జిల్లాలోని బచ్చన్నపేట మండల పరిధిలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా సందర్శించి, తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా వైద్యులు, సిబ్బంది రిజిస్టర్, ఓపి రిజిస్టర్, పిల్లల వార్డు, ఇన్ పెషేంట్ వార్డులను, మందుల నిల్వలను పరిశీలించారు.
ఓపీ ద్వారా ప్రతి రోజు ఎంత మంది వైద్యం పొందుతున్నారు? అలాగే ఎంత మంది గర్భిణీ స్త్రీలకు ప్రసవాలు జరిగాయి? అని వైద్యాధికారిని అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీల ప్రసవాల సంఖ్యను మరింతగా పెంచాలని, అందుకు తగ్గట్లుగా వైద్యాధికారులు, ఆశాలు పని చేయాలన్నారు.
ఇన్ పెషేంట్ వార్డులోకి వెళ్లి రోగులతో మాట్లాడారు. ఏ సమస్యతో బాధపడుతూ ఆసుపత్రిలో వైద్యం తీసుకుంటున్నారు? అని కలెక్టర్ ఆరా తీశారు.
అలాగే ఆసుపత్రి లోపల, పరిసరాలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, చెత్తాచెదారం, పిచ్చిమొక్కలను తొలగించాలని, చెట్లను సంరక్షిస్తూ పచ్చదనాన్ని పెంపొందించాలని తెలిపారు.
అనంతరం అదే మండలంలోని రాఘవాపూర్, మన్సాన్ పల్లి, లింగంపల్లి, కొన్నె, రామచంద్రాపురం, ఇటిక్యాల పల్లి గ్రామాల్లో జరుగుతోన్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ పర్యవేక్షించారు.
ఈ నేపథ్యంలో వివిధ దశల్లో ఉన్న ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి, నాణ్యతాప్రమాణాలను తప్పకుండా పాటించాలని అధికారులకు సూచించారు. పనులను నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని, లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నిర్మాణ సామగ్రి నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
అలాగే లబ్ధిదారులతో మాట్లాడి, ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి, గృహ ప్రవేశాలు చేయాలని సూచించారు.
ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ప్రతి అర్హులైన కుటుంబానికి గృహ సౌకర్యం కల్పించడమే లక్ష్యమని, అధికారులు సమన్వయంతో పనిచేసి ఈ లక్ష్యాన్ని సాధించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
తదనంతరం అదే మండలంలోని మన్సాన్ పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి, తనిఖీ చేపట్టారు.
ఈ క్రమంలో కేంద్రంలో నమోదైన చిన్నారుల ఎత్తు, బరువు కొలతలను పరిశీలించారు.
పిల్లల ఎదుగుదలను నిరంతరం పర్యవేక్షించడం ఎంతో ముఖ్యమని, ప్రతి చిన్నారి ఎత్తు, బరువు వివరాలను క్రమం తప్పకుండా నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. పోషకాహార లోపం ఉన్న పిల్లలను గుర్తించి, వారికి ప్రత్యేక ఆహారాన్ని అందించాలని ఆదేశించారు.
అలాగే చిన్నారుల ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలను అడిగి తెలుసుకొని, వృద్ధి చార్టుల ఆధారంగా పిల్లల ఆరోగ్య స్థితిని విశ్లేషించి, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు.
చిన్నారుల ఆరోగ్యవంతమైన భవిష్యత్తు కోసం అంగన్వాడీ కేంద్రాల సేవలు కీలకమని కలెక్టర్ తెలిపారు.
అదే విధంగా చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం, గుడ్లు, పాలు, పప్పులు తదితరాల నాణ్యతను పరిశీలించారు. ఆహార పదార్థాల నిల్వ విధానం, వంటశాల పరిశుభ్రత, పిల్లల హాజరు వివరాలను పరిశీలించారు.
అలాగే గర్భిణీ స్త్రీలు, బాలింతలకు అందిస్తున్న సేవలు, పోషణ కార్యక్రమాల అమలు విధానంపై వివరాలు తెలుసుకున్నారు. రికార్డులను కూడా పరిశీలించి, సక్రమంగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు.
అనంతరం అదే మండలంలోని మన్సాన్ పల్లి గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ సందర్శించి, ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.
ఈ సందర్భంగా పాఠశాలలో జరుగుతున్న బోధన విధానం, విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల పనితీరును పరిశీలించారు.
విద్యార్థులతో మాట్లాడి, వారి చదువు స్థాయి, అర్థం చేసుకునే సామర్థ్యాన్ని కలెక్టర్ పరీక్షించారు.
పాఠ్యాంశాల బోధనను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు.
మధ్యాహ్న భోజన పథకం అమలు విధానాన్ని పరిశీలించి, ఆహార నాణ్యత, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. అలాగే పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం కల్పించాలని సూచించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమని కలెక్టర్ తెలిపారు.
ఈ పర్యటనలో హౌసింగ్ పీడీ మాతృ నాయక్, ఇతర సంబంధిత అధికారులు, అంగన్వాడీ టీచర్లు, ఉపాధ్యాయులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.