విద్యార్థులు చదువులో రాజీ పడొద్దని, ఎంచుకున్న లక్ష్యాల దిశగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్పష్టం చేశారు.
శుక్రవారం, జిల్లా కేంద్రంలో గల తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సందర్శించి, ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు.
ఈ సందర్భంగా పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు, మూత్రశాలలను పరిశీలించి, విద్యార్థుల విద్యా ప్రమాణాలు, పాఠశాలలో కల్పిస్తోన్న మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు.
అలాగే తరగతి గదులు, కంప్యూటర్ విద్య, విద్యార్థుల హాజరు వంటి అంశాలను పర్యవేక్షించి, పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ముఖ్యంగా 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు బోధన విధానం, హిందీ, ఇంగ్లీష్, గణితం, సైన్స్ వంటి విషయాల్లో విద్యార్థుల ప్రగతిని పరీక్షించి, 9 వా తరగతి విద్యార్థులకు గణితంలోని పలు అంశాలపై సులభమైన పద్ధతి ద్వారా కలెక్టర్ విద్యార్థులకు బోధించారు.
10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేకంగా వార్షిక పరీక్షల దృష్ట్యా రివిజన్ (పునర్విమర్శ) తరగతులను పక్కాగా నిర్వహించాలని సూచించారు.
అదే విధంగా పాఠశాలలో పరిశుభ్రత, తాగునీటి వసతులపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో సమావేశమై బోధనలో నాణ్యత పెంచాలని, ప్రతి సబ్జెక్టులో విద్యార్థుల సామర్థ్యాన్ని పెంపొందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
9వ తరగతి విద్యార్థులకు గణితంలో మౌలిక అంశాలు (Mean, Median, Mode) పట్ల స్పష్టత కల్పించాలని, అలాగే పాఠశాలలో ఎన్సీసీ (NCC) కార్యక్రమాలు చేపట్టి, విద్యార్థులు క్రమశిక్షణను అలవర్చుకునేలా ప్రోత్సహించాలని సూచించారు.
ఈ పరిశీలనలో పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్, ఇతర సంబంధిత అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.