రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో నవాబుపేట గ్రామం రోల్ మోడల్ గా నిలవాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు గ్రామంలో సమస్యల పరిష్కారానికి గ్రామస్తులంతా కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.
సోమవారం కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేట గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేసే కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా కలెక్టర్ చిత్రమిశ్రా తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గ్రామస్తులంతా ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి కృషి చేయాలని పేర్కొన్నారు. పాఠశాలలో హాజరు శాతం పెంచాలని పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. గ్రామస్తులు అనవసరంగా డబ్బులు ఖర్చు చేసుకోవద్దని పేర్కొన్నారు. గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారానికి 20 లక్షలు మంజూరు చేశామని పేర్కొన్నారు.
నవాబుపేట గ్రామాభివృద్ధికి ఎల్లవేళలా పాటుపడతామనీ, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన ప్రగతి కార్యక్రమంలో గ్రామస్తులంతా పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని కోరారు. తద్వారా గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామని తెలిపారు. రైతులందరూ తమ పశువులకు తప్పనిసరిగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని సూచించారు. రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తున్నదని పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ సంబంధిత అధికారులు పశువులన్నింటికీ గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయాలనీ, రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని స్పెషల్ డ్రైవ్ తీసుకొని విజయవంతంగా పూర్తి చేయాలనీ, తద్వారా పశువుల్లో వచ్చే వ్యాధుల నియంత్రణకు పాటుపడాలని పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని రైతులందరూ వినియోగించుకోవాలని సూచించారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా సంబంధిత అధికారులు చొరవ తీసుకోవాలన్నారు.
అనంతరం నవాబ్ పేట గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారానికి చేపట్టిన రక్షిత మంచినీటి సరఫరా పథకాన్ని మంత్రి ప్రారంభించారు. అదేవిధంగా పశు వైద్య ఉపకేంద్రం నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, డిపిఓ జగదీశ్వర్, డిఆర్డి ఓ శ్రీధర్, ఆర్డిఓ మహేశ్వర్ హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి స్థానిక తహసిల్దారు రమేష్, గ్రామ సర్పంచ్ గూళ్ల రజిత రాజు, పలువురు అధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.