సుల్తానాబాద్ , ఆగస్టు-11: సంక్షేమ శాఖ లో వసతి పొందుతున్న చిన్నారులు, వృద్ధులకు మెరుగైన సౌకర్యాలు, భద్రత, అవసరమైన సంరక్షణ అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు.
మంగళవారం సుల్తానాబాద్ మండలంలోని క్యాడర్ దివ్యాంగుల పాఠశాల, వృద్ధాశ్రమం, బాల సదనం పాఠశాల, మండల విద్యా వనరుల కేంద్రాన్ని, అలాగే పెద్దపల్లిలోని రంగంపల్లి బాల రక్షక భవన్ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా సంస్థల్లోని వసతి సౌకర్యాలు, సిబ్బంది విధుల నిర్వహణ, చిన్నారులు, వృద్ధులకు అందుతున్న సేవలను పరిశీలించారు.
ఈ సందర్భంగా వంటశాలలు, డార్మిటరీలను జిల్లా కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. వంటశాలల్లో పరిశుభ్రత, ఆహార నాణ్యత, పరిసరాల నిర్వహణ తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వసతి గదుల్లో పరిశుభ్రత, తగిన సౌకర్యాలు, చిన్నారులు మరియు వృద్ధుల భద్రతకు తీసుకుంటున్న చర్యలను పరిశీలించి, అవసరమైన చోట తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.
సిబ్బంది విధుల నిర్వహణపై ప్రత్యేకంగా ఆరా తీశారు. ప్రతి ఉద్యోగి నిర్ణీత సమయానికి విధులకు హాజరై, తమకు కేటాయించిన బాధ్యతలను పూర్తి స్థాయి బాధ్యతతో, సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆదేశించారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం లేకుండా సంస్థల నిర్వహణపై సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.
చిన్నారులు, వృద్ధుల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. వారి ఆరోగ్యం, భద్రత, ఆహారం, వసతి తదితర అంశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, వారి అవసరాలను గుర్తించి తక్షణమే పరిష్కరించే విధంగా అధికారులు, సిబ్బంది పనిచేయాలని ఆదేశించారు.
బాల రక్షక భవన్లో చిన్నారుల సంరక్షణ, రక్షణకు సంబంధించిన అంశాలను సమీక్షించారు. అక్కడ పనిచేస్తున్న ప్రతి సిబ్బంది తమకు కేటాయించిన జాబ్ చార్ట్ ప్రకారం విధులను తప్పనిసరిగా నిర్వహించాలని స్పష్టం చేశారు. సిబ్బంది బాధ్యతలను స్పష్టంగా నిర్వర్తించేలా సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని సూచించారు.
అనంతరం POCSO కేసులపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాలలపై లైంగిక వేధింపులు, హింస వంటి ఘటనలు చోటుచేసుకున్నప్పుడు బాధిత చిన్నారులకు సకాలంలో రక్షణ, అవసరమైన సహాయం, కౌన్సెలింగ్ తదితర సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బాల రక్షక వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేసేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.
భరోసా కేంద్రాలను కూడా పరిశీలించి బాలల రక్షణ, సంరక్షణకు సంబంధించిన కేసులను సున్నితంగా పరిగణించి, బాధితులకు అవసరమైన సేవలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాలల సంరక్షణకు సంబంధించిన ప్రభుత్వ సేవలు, రక్షణ వ్యవస్థలపై గ్రామస్థాయి నుంచి ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.
బాలలపై జరిగే హింస, వేధింపులు, నిర్లక్ష్యం వంటి ఘటనలను గుర్తించి సంబంధిత వ్యవస్థల దృష్టికి తీసుకువచ్చేలా ప్రజలకు అవగాహన కల్పించాలని, తద్వారా అవసరమైన ప్రతి కేసు అధికారుల దృష్టికి వచ్చి బాధిత చిన్నారులకు సకాలంలో రక్షణ, సహాయం అందించేందుకు అవకాశం కల్పించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఈ తనిఖీల్లో సంబంధిత శాఖల అధికారులు, సంస్థల నిర్వాహకులు, సిబ్బంది తదితరులు, పాల్గొన్నారు.
-------------------------------------------------------------------------------------------------------------------
జిల్లా పౌర సంబంధాల అధికారి, పెద్దపల్లి చే జారీ చేయనైనది