ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ ఆలీ చదువుకున్న పాఠశాల కు 5.కోట్లు మంజూరు
చదువుకున్న బడికి తిరిగి వచ్చి... జ్ఞాపకాల ఒడిలో మునిగిపోయిన షబ్బీర్ అలీ
నేటి ప్రభాత దర్శిని ప్రతినిధి కామారెడ్డి
తాను విద్యనభ్యసించిన పాఠశాల అభివృద్ధికి రూ.5 కోట్లు మంజూరు చేయించిన కామారెడ్డి ముద్దుబిడ్డ.
పాత భవనం కూల్చే ముందు క్లాస్రూమ్లో కూర్చొని నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్న ప్రభుత్వ సలహాదారు.
ఒక మనిషి జీవితంలో ఎన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించినా... తనను తీర్చిదిద్దిన పాఠశాల జ్ఞాపకాలను మాత్రం ఎప్పటికీ మరచిపోలేడు.
అందుకు నిదర్శనంగా నిలిచారు కామారెడ్డి ముద్దుబిడ్డ, మాజీ మంత్రి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారు.
తాను విద్యనభ్యసించిన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను బుధవారం సందర్శించిన షబ్బీర్ అలీ పాత భవనాన్ని చూసి ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు.
చిన్ననాటి అడుగులు వేసిన ప్రాంగణం, విద్యాబుద్ధులు నేర్చుకున్న తరగతి గదులు, తనతో కలిసి చదువుకున్న స్నేహితులు... ఒక్కొక్కటి ఆయన కళ్లముందు మెదిలాయి.
పాత భవనాన్ని కూల్చి ఆధునిక వసతులతో నూతన పాఠశాలగా తీర్చిదిద్దే క్రమంలో భాగంగా ఆయన పాఠశాలను సందర్శించారు.
తాను చదువుకున్న తరగతి గదిలోకి వెళ్లి కొద్దిసేపు కూర్చొని, చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
ఆ సమయంలో ఆయన ముఖంలో కనిపించిన భావోద్వేగం అక్కడున్న పూర్వ విద్యార్థులను సైతం కదిలించింది.
“ఈ బడికి నేను ఏదో ఒకటి చేయాలి...”
తాను చదువుకున్న పాఠశాల అభివృద్ధికి తన వంతు సహకారం అందించాలనే ఆలోచన తనలో ఎప్పటి నుంచో ఉందని షబ్బీర్ అలీ తెలిపారు.
“నేను చదువుకున్న బడి ఇది. ఈ పాఠశాల నాకు కేవలం ఒక విద్యాలయం కాదు... నా జీవితానికి పునాది వేసిన ప్రదేశం.
ఇక్కడి నుంచే నా ప్రయాణం ప్రారంభమైంది. అందుకే ఈ బడికి ఏదో ఒక మంచి చేయాలనే తపన ఎప్పటికీ ఉంటుంది” అని ఆయన భావోద్వేగంగా పేర్కొన్నారు.
1971లో తాను విద్యనభ్యసించిన ఈ పాఠశాల విద్యార్థులను, పూర్వ విద్యార్థులను కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.
తనతో కలిసి చదువుకున్న మిత్రులను మళ్లీ అదే పాఠశాల ప్రాంగణంలో కలుసుకోవడం తనకు మరపురాని అనుభూతి అని తెలిపారు.
రూ.5 కోట్లతో ఆధునిక పాఠశాలగా రూపాంతరం
తాను చదువుకున్న పాఠశాల అభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న షబ్బీర్ అలీ, ముఖ్యమంత్రి దృష్టికి పాఠశాల అవసరాలను తీసుకెళ్లి రూ.5 కోట్ల అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించారు.
పాఠశాల భవన అభివృద్ధితో పాటు విద్యార్థులకు నేటి ఆధునిక విద్యా ప్రమాణాలకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించేందుకు ఆయన ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు.
అత్యాధునిక ల్యాబొరేటరీలు, కంప్యూటర్ ల్యాబ్లు, డిజిటల్ తరగతి గదులు, ఆధునిక విద్యా సౌకర్యాలతో పాఠశాలను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. పాఠశాల అభివృద్ధికి అవసరమైన చోట తన సొంతంగా కూడా ఖర్చు చేస్తూ సహకరిస్తున్నట్లు తెలిపారు.
పూర్వ విద్యార్థులతో ఆత్మీయ సమ్మేళనం
ఈ సందర్భంగా పాఠశాలలో పూర్వ విద్యార్థులతో షబ్బీర్ అలీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. తనతో కలిసి చదువుకున్న పూర్వ విద్యార్థులను ఆత్మీయంగా పలకరించి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
చిన్ననాటి అనుభవాలు, పాఠశాలలో గడిపిన రోజులు, అప్పటి ఉపాధ్యాయులు, స్నేహితులతో ఉన్న అనుబంధాలను గుర్తు చేసుకుంటూ పూర్వ విద్యార్థులతో సరదాగా ముచ్చటించారు.
ఏళ్ల తర్వాత ఒకే చోట కలుసుకున్న పాత స్నేహితుల మధ్య ఆత్మీయత, ఆనందం, జ్ఞాపకాలతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది.
తాను చదివిన పాఠశాల పాత భవనం త్వరలో కొత్త రూపు సంతరించుకోనుండటంతో ఒకవైపు ఆనందంగా ఉన్నప్పటికీ, తన బాల్య జ్ఞాపకాలకు సాక్ష్యంగా నిలిచిన పాత భవనాన్ని వీడాల్సి రావడం కొంత భావోద్వేగానికి గురిచేసిందని షబ్బీర్ అలీ తెలిపారు.
“భవనం మారుతుంది... కానీ ఈ బడి నాకు ఇచ్చిన జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ మారవు” అన్న ఆయన మాటలు అక్కడున్న వారిని భావోద్వేగానికి గురిచేశాయి.
బడిని మరచిపోని బిడ్డ...
జీవితంలో ఎంత ఎదిగినా తనను తీర్చిదిద్దిన విద్యాలయాన్ని మరచిపోకుండా, అదే పాఠశాల అభివృద్ధికి కోట్ల రూపాయల నిధులు తీసుకురావడమే కాకుండా ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దేందుకు కృషి చేయడం పట్ల పూర్వ విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
తాను చదివిన బడికి తిరిగి వచ్చి... అక్కడి విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేయాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్న షబ్బీర్ అలీ ప్రయత్నాలు, “చదువు ఇచ్చిన బడికి రుణం తీర్చుకోవాలనే” గొప్ప మనసుకు నిదర్శనంగా నిలుస్తున్నాయని పలువురు అభినందించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఉమారాణి శ్రీనివాస్, గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, కైలా శ్రీనివాస్, మహమ్మద్ ఇలియాస్, పండ్ల రాజు, పూర్వ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.