శనివారం వార్షిక తనిఖీల్లో భాగంగా వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు.ఈసందర్భంగా ఎస్పీ గారు పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించి వారు ప్రదర్శించిన ఫుట్ డ్రిల్, లాఠీ డ్రిల్ను పరిశీలించి అభినందించారు.
ఈసందర్భంగా స్టేషన్ పరిధిలో నమోదైన కేసులు, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, స్టేషన్ రికార్డుల నిర్వహణ, సిబ్బంది హాజరు,పెట్రోలింగ్ నిర్వహణ, రౌడీషీటర్లు, పాత నేరస్తులపై నిఘా తదితర అంశాలను క్షుణ్ణంగా సమీక్షించి, ప్రజలకు అందిస్తున్న పోలీసు సేవలపై ప్రత్యేకంగా ఆరా తీశారు.
ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా పోలీసు అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే అధికారులను ఆదేశించారు.కేసుల విచారణలో త్వరగతిన దర్యాప్తు,సాక్ష్యాల సేకరణలో నిష్పక్షపాత దృక్పథం అవసరమని తెలిపారు.పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బంది పనితీరు భేషుగ్గా ఉందని అభినందించారు.
విజిబుల్ పోలీసింగ్లో భాగంగా అధికారులు, విపివోలు గ్రామాల్లో పర్యటిస్తూ ఎలాంటి సంఘటన జరిగినా వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం చేరేలా సమాచార వ్యవస్థను పటిష్ఠం చేయాలని సూచించారు. అలాగే గ్రామీణ ప్రాంత ప్రజలకు, యువతకు మాదకద్రవ్యాల దుష్పరిణామాలు, సైబర్ నేరాలు, రోడ్డు భద్రతపై విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు.
బ్లూ కోల్ట్, పెట్రోకార్ సిబ్బంది గ్రామాల్లో పెట్రోలింగ్ను మరింత ముమ్మరం చేసి అనుమానితులు, రౌడీషీటర్లు, హిస్టరీషీటర్లు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిరంతర నిఘా ఉంచి తరచూ తనిఖీలు నిర్వహించాలని సూచించారు.
నేను సైతం కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో సీసీ కెమెరాల ప్రాముఖ్యతను ప్రజలకు వివరించి, నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో వాటి పాత్రను తెలియజేస్తూ సీసీ కెమెరాల ఏర్పాటులో ప్రజలను భాగస్వాములను చేయాలని తెలిపారు.
ఎస్పీ గారి వెంట డిఎస్పీ శ్రీనివాసులు , సి.ఐ శ్రీనివాస్, ఎస్.ఐ వెంకట్రాజం, సిబ్బంది పాల్గొన్నారు.