జనగామ
*ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామకాల్లో పారదర్శకతకు ప్రత్యేక త్రైపాక్షిక ఒప్పందం తప్పనిసరి*
*అగ్రిమెంట్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఏజెన్సీలపై చట్టపరమైన చర్యలు*
*ప్రతి నెల ఒకటో తేదీనే ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు జమ కావాలి*
*జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా*
జిల్లాలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవా నియమాలు, జీతాల చెల్లింపులు, ఏజెన్సీల బాధ్యతలను మరింత పారదర్శకంగా, జవాబుదారీతనంతో అమలు చేయడానికి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామకాలు సంబంధిత గుర్తింపు పొందిన ఏజెన్సీల ద్వారా నిర్వహించడం జరుగుతోందని తెలిపారు.
ఈ నేపథ్యంలో జిల్లాలోని అన్ని శాఖల అధికారులు ఆయా ఏజెన్సీలతో ఈ నెల 25వ తేదీలోగా అగ్రిమెంట్ ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు.
ఈ అగ్రిమెంట్ సాధారణ ఒప్పందం కాకుండా త్రైపాక్షిక (Tripartite) ఒప్పందం రూపంలో ఉండాలని స్పష్టం చేశారు.
ఇందులో సంబంధిత శాఖ (Concerned Department) మొదటి పక్షంగా, ఔట్సోర్సింగ్ ఏజెన్సీ రెండో పక్షంగా, జిల్లా కలెక్టర్, ఔట్సోర్సింగ్ కమిటీ ఛైర్మన్ మూడో పక్షంగా ఉంటారని తెలిపారు.
ఈ విధానంతో ఉద్యోగుల హక్కులకు రక్షణ కల్పించడంతో పాటు ఏజెన్సీల బాధ్యతను మరింత పెంచడం లక్ష్యమన్నారు.
అగ్రిమెంట్ను రూ.100 విలువ గల నాన్-జ్యుడీషియల్ స్టాంప్ పేపర్ విలువ గల బాండ్పై నమోదు చేయాలని సూచించారు. ఒప్పందంలోని నిబంధనలను ఏజెన్సీలు ఉల్లంఘించినట్లయితే, వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఒప్పంద నిబంధనల ప్రకారం తగిన చర్యలు కూడా అమలు చేస్తామని హెచ్చరించారు.
జిల్లాలోని అన్ని శాఖాధిపతులు ప్రతి నెల ఒకటో తేదీన ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు వారి బ్యాంకు ఖాతాల్లో తప్పనిసరిగా జీతం తో పాటు EPF, ESI కూడా సంబంధిత ఉద్యోగి ఖాతా లో జమ అయ్యేలా శాఖ అధిపతులు, ఏజెన్సీ యాజమాన్యం పర్యవేక్షించాలని *కలెక్టర్* ఆదేశించారు. ఉద్యోగులకు జీతాల చెల్లింపులో ఎలాంటి జాప్యం జరగకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
ప్రస్తుతం జిల్లాలో (8) ఔట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా 577 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు వివిధ ప్రభుత్వ శాఖల్లో సేవలందిస్తున్నారని తెలిపారు.
వీరి సేవా భద్రత, వేతనాల సకాలంలో చెల్లింపు, ఒప్పంద నిబంధనల అమలు, బాధ్యతాయుత పరిపాలనకు ఈ త్రైపాక్షిక ఒప్పంద విధానం దోహదపడుతుందని స్పష్టం చేశారు.