జూలై 28
జనగామ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన ఏకరూప దుస్తులను త్వరితగతిన అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సంబంధిత అధికారులను ఆదేశించారు.
మంగళవారం, జిల్లాలోని దేవరుప్పుల మండలంలో స్వయం సహాయక సంఘాలకు చెందిన మాస్టర్ దర్జీ (టైలర్) వద్ద జరుగుతున్న ఏకరూప దుస్తుల కుట్టు పనులను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రత్యక్షంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా కుట్టు ప్రక్రియ పురోగతి, రోజువారీగా ఎన్ని ఏకరూప దుస్తులను కుట్టుతున్నారనే వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
ఏకరూప దుస్తుల తయారీ ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా వేగవంతంగా పూర్తి చేయాలని, అవసరమైన మానవ వనరులు, యంత్రాలను సమర్థంగా వినియోగించి, నిర్దేశిత గడువులో పనులను పూర్తి చేయాలని సూచించారు.
కుట్టిన ఏకరూప దుస్తుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని, ప్రతి యూనిఫామ్ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా పర్యవేక్షించాలన్నారు.
కుట్టు పూర్తయిన వెంటనే పాఠశాలల వారీగా ఏకరూప దుస్తులను వర్గీకరించి, సంబంధిత విద్యార్థులకు ఆలస్యం లేకుండా పంపిణీ చేయాలని డీఆర్డీఓ అధికారిని ఆదేశించారు.
స్వయం సహాయక సంఘాలకు ఈ కార్యక్రమం ద్వారా ఉపాధితో పాటు ఆదాయం కూడా లభిస్తుందని, వారు సమయపాలన పాటిస్తూ నాణ్యతతో పనులు పూర్తి చేసి ప్రభుత్వంపై ఉన్న విశ్వాసాన్ని నిలబెట్టాలని పేర్కొన్నారు.
ఈ పరిశీలనలో డీఆర్డీఓ భాస్కర్, ఇతర సంబంధిత అధికారులు, సిబ్బంది, స్వయం సహాయక సంఘాల ప్రతినిధులు, మాస్టర్ దర్జీలు, తదితరులు పాల్గొన్నారు.