*కాల్వశ్రీరాంపూర్, జూలై-24:*పెద్దపల్లి జిల్లాలో ఆయిల్పామ్ సాగు విస్తరణకు ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను రైతులు సద్వినియోగం చేసుకుని, రైతులకు నాణ్యమైన ఆయిల్పామ్ మొక్కలను మాత్రమే సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులు, కంపెనీ ప్రతినిధులను ఆదేశించారు.
శుక్రవారం కాల్వ శ్రీరాంపూర్ మండలం కూనారం గ్రామంలో 128 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన మెగా ఆయిల్పామ్ ప్లాంటేషన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం రైతు శ్రీ గీత్ల పవన్ కుమార్ రెడ్డి 17 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఆయిల్పామ్ తోటను పరిశీలించి, సాగు విధానాలు, మొక్కల నాణ్యత, రైతులకు అందుతున్న ప్రోత్సాహకాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ జిల్లాలో ఆయిల్పామ్ సాగు విస్తరణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. రైతులకు అందుతున్న ప్రోత్సాహకాలు, మొక్కల నాణ్యత, తిరుమల ఆయిల్కెమ్ ఫ్యాక్టరీ నిర్మాణం, భవిష్యత్తులో ఆయిల్పామ్ గెలల కొనుగోలు వంటి అంశాలపై సంబంధిత అధికారులను, కంపెనీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు.
తిరుమల ఆయిల్కెమ్ కంపెనీ ఫ్యాక్టరీ నిర్మాణ పనుల పురోగతిపై కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ మనీష్ బురారియాతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్యాక్టరీ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, అక్టోబర్ నెలలో ఫ్యాక్టరీని ప్రారంభించి కార్యకలాపాలు చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు కంపెనీ ప్రతినిధులు వివరించారు. నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేసి రైతులకు సేవలు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ సూచించారు.
రైతులకు నాణ్యమైన ఆయిల్పామ్ మొక్కలే అధిక దిగుబడులకు, దీర్ఘకాలిక ఆదాయానికి పునాదిగా నిలుస్తాయని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. మొక్కల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా ఉత్తమ నాణ్యత గల నాట్లను మాత్రమే రైతులకు సరఫరా చేయాలని కంపెనీ ప్రతినిధులను ఆదేశించారు. రైతుల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా నాణ్యత ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు.
ప్రస్తుతం ఎల్నినో ప్రభావంతో పొడి వాతావరణ పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. *VB-G RAM (G)* పథకం కింద 100 శాతం సబ్సిడీతో ప్రభుత్వం అందిస్తున్న ఫార్మ్ పాండ్లను ఆయిల్పామ్ రైతులు తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. వర్షపు నీటిని ఫార్మ్ పాండ్లలో నిల్వ చేసుకుని అవసరమైన సమయంలో ఆయిల్పామ్ తోటలకు అందించడం ద్వారా పొడి పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని వివరించారు.
డ్రిప్ ఇరిగేషన్, మల్చింగ్, ఫార్మ్ పాండ్లు వంటి నీటి సంరక్షణ పద్ధతులను పాటిస్తూ ఆయిల్పామ్ సాగు చేపట్టాలని రైతులకు సూచించారు. ఆయిల్పామ్ తక్కువ నీటి వినియోగంతో దీర్ఘకాలికంగా స్థిరమైన ఆదాయాన్ని అందించే వాణిజ్య పంటగా అభివృద్ధి చెందుతోందని, జిల్లాలో అనుకూలమైన భూములు, నీటి వనరులు ఉన్న రైతులు ఈ పంట సాగు వైపు మొగ్గు చూపాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన మరియు పట్టు పరిశ్రమల అధికారి శ్రీ గడ్డం శ్యామ్ ప్రసాద్, తిరుమల ఆయిల్కెమ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ మనీష్ బురారియా, సీఈఓ శ్రీ కేశు కల్యాణ్కర్, ఉద్యానవన అధికారి శ్రీ మహేష్, వ్యవసాయ అధికారి శ్రీమతి సంధ్య, కూనారం సర్పంచ్ శ్రీ రాజయ్య, జాఫర్ఖాన్పేట సర్పంచ్ శ్రీమతి యాదగిరి జ్యోత్స్న, కూనారం, జాఫర్ఖాన్పేట గ్రామాలకు చెందిన రైతులు, ఆయిల్పామ్ సాగుదారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
----------------------------------------------------------------------------------------
*జిల్లా పౌర సంబంధాల అధికారి, పెద్దపల్లి చే జారీ చేయనైనది*