రైతులకు మరింత చేరువగా అయ్యి వారి విద్యుత్ సమస్యలను నేరుగా క్షేత్రస్థాయిలో అర్థం చేసుకుని తక్షణ పరిష్కారం అందించేందుకు ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్) చేపట్టిన "రైతు పొలం బాట" కార్యక్రమం అత్యంత ప్రభావవంతంగా నిర్వహించబడుతోందని ఎన్పీడీసీఎల్ చీఫ్ ఇంజనీర్ శ్రీ అశోక్ స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్ళపల్లి సెక్షన్ పరిధిలో పాపయ్యపల్లి గ్రామంలో గురువారం ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.
రాజన్న సిరిసిల్ల సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఆపరేషన్స్) శ్రీ బి. బిక్షపతి తో కలిసి చీఫ్ ఇంజనీర్ శ్రీ అశోక్ స్వయంగా పొలాల వద్దకు వెళ్లి రైతులతో ముఖాముఖి సంభాషించారు. ఉన్నతాధికారులు స్వయంగా పొలాల వద్దకు రావడం చూసిన రైతులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జూనియర్ ఇంజనీర్లు, లైన్మెన్లు పాల్గొన్నారు.
ట్రాన్స్ఫార్మర్ నిర్వహణ – తక్షణ సేవలు:
కార్యక్రమంలో భాగంగా పాపయ్యపల్లి గ్రామంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ నిర్వహణను సిబ్బంది అక్కడికక్కడే చేపట్టారు. ట్రాన్స్ఫార్మర్ పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించి, అవసరమైన మరమ్మతులు, నిర్వహణ పనులను తక్షణమే నిర్వహించారు. విద్యుత్ సరఫరా నిరంతరాయంగా అందేలా చూడడమే లక్ష్యంగా సిబ్బంది కృషి చేశారు.
భద్రత, అవగాహన – రైతులకు మార్గదర్శనం:
ఈ సందర్భంగా రైతులతో మాట్లాడిన చీఫ్ ఇంజనీర్ శ్రీ అశోక్, వ్యవసాయ విద్యుత్ సరఫరా, భద్రతా చర్యలు, విద్యుత్ వినియోగంపై రైతులకు సవివరంగా అవగాహన కల్పించారు. వ్యవసాయ పనుల సమయంలో విద్యుత్ ప్రమాదాల నుండి తమను తాము ఎలా కాపాడుకోవాలో ఆచరణాత్మక సూచనలు అందించారు.
క్షేత్రస్థాయిలో గుర్తించిన ప్రమాదకర పరిస్థితులైన –లూజ్ లైన్లు – వేలాడుతూ ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తీగలను తక్షణమే సరిదిద్దడం, వంగినవిద్యుత్ స్థంభాలను సరి చేయడం,
తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్ఫార్మర్లను ఎత్తుపెంచడం వంటి అంశాలను ప్రాధాన్యంగా తీసుకుని వెంటనే సరిచేస్తున్నామని రైతులకు భరోసా ఇచ్చారు. ఈ పనులు ఏ మాత్రం జాప్యం లేకుండా యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
స్వయంగా విద్యుత్ పనులు చేయవద్దు – విజ్ఞప్తి:
ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు స్వయంగా విద్యుత్ కనెక్షన్లు మార్చడం, వైర్లు సరిచేయడం లేదా ట్రాన్స్ఫార్మర్లను ముట్టుకోవడం చేయకూడదని చీఫ్ ఇంజనీర్ విజ్ఞప్తి చేశారు. ఏదైనా సమస్య తలెత్తిన వెంటనే విద్యుత్ సిబ్బందిని సంప్రదించాలని, లేదా ఎన్పీడీసీఎల్ టోల్ఫ్రీ నంబర్ 1912కు వెంటనే కాల్ చేయాలని కోరారు. అజాగ్రత్తగా వ్యవహరించడం వల్ల ప్రాణాంతక ప్రమాదాలు సంభవిస్తాయని హెచ్చరించారు.
రైతులకు చేరువగా ఎన్పీడీసీఎల్ – ముందుకు సాగే నిబద్ధత:
విద్యుత్ సేవలను ప్రజలకు మరింత మెరుగ్గా, నిరంతరాయంగా, నాణ్యంగా అందించడం తమ ప్రధాన బాధ్యతగా భావిస్తున్నామని చీఫ్ ఇంజనీర్ శ్రీ అశోక్ స్పష్టం చేశారు. "రైతు పొలం బాట" వంటి వినూత్న కార్యక్రమాల ద్వారా అన్నదాతలకు మరింత చేరువై, వారి సమస్యలను అర్థం చేసుకుని, తక్షణ పరిష్కారం అందిస్తూ ముందుకు వెళ్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం జిల్లాలోని అన్ని మండలాల్లో నిర్వహిస్తామని, ఒక్క రైతు సమస్య కూడా పరిష్కారానికి నోచుకోకుండా ఉండదని ఆయన హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో సిరిసిల్ల డివిజనల్ ఇంజనీర్ ఎన్ . అంజయ్య, ఏ.డి .ఈ గోపినాధ్ , అసిస్టెంట్ ఇంజనీర్ మధుకర్ , జూనియర్ ఇంజనీర్లు, లైన్మెన్లు, స్థానిక రైతులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.