శనివారం నాటికి ఆరోగ్య కేంద్రానికి నీటి సరఫరా అందుబాటులోకి తేవాలి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
ఆగస్టు 11
జనగామ
రోగులకు మెరుగైన వైద్య సేవలు, మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు.
మంగళవారం, జిల్లాలోని రఘునాథపల్లి మండలం, కోమల్ల గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా సందర్శించి, ఆరోగ్య కేంద్రంలో అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది హాజరు, రోగులకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్య నిర్వహణ, తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా ముందుగా ఆరోగ్య కేంద్రంలోని ఇన్ పేషెంట్ (IP) వార్డును పరిశీలించిన కలెక్టర్, ఓపీ రిజిస్టర్ను తనిఖీ చేశారు. విధులకు హాజరైన సిబ్బంది వివరాలతో పాటు గైర్హాజరైన సిబ్బంది వివరాల గురించి వైద్యాధికారిని అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలు అందించే సమయంలో సిబ్బంది తప్పనిసరిగా సమయపాలన పాటించాలని సూచించారు.
ఆరోగ్య కేంద్రం పరిసరాలు, వార్డులు, రోగులు వేచి ఉండే ప్రదేశాలు, ఇతర గదుల్లోని పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించిన కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్య కేంద్రంలో పరిశుభ్రత అత్యంత ముఖ్యమైన అంశమని, రోగులకు చికిత్స అందించే ప్రదేశం అన్ని వేళలా శుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉండాలని స్పష్టం చేశారు.
ఆరోగ్య కేంద్రం ఆవరణతో పాటు అన్ని విభాగాలను పూర్తిస్థాయిలో శుభ్రం చేయించాలని, ఎక్కడా చెత్త, దుమ్ము, అపరిశుభ్రత కనిపించకుండా చూడాలని పంచాయతీ కార్యదర్శికి ఆదేశించారు.
అనంతరం టీకాల గది, ప్రయోగశాల (ల్యాబ్), ఫార్మసీలను కలెక్టర్ తనిఖీ చేశారు. ల్యాబ్లో నిర్వహిస్తున్న పరీక్షలు, రోగులకు టెస్ట్ రిపోర్టులు అందజేస్తున్న విధానం గురించి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరీక్షలు పూర్తయిన అనంతరం రోగులకు రిపోర్టులు నిర్ణీత సమయంలో అందేలా చూడాలని సూచించారు.
ఫార్మసీలో మందుల నిల్వలు, అందుబాటులో ఉన్న ఔషధాల వివరాలను తనిఖీ చేశారు. మందుల వినియోగంలో FIFO (First In – First Out) పద్ధతిని తప్పనిసరిగా పాటించాలని, ముందుగా వచ్చిన మందులను ముందుగా వినియోగించేలా స్టాక్ నిర్వహణ చేయాలని ఆదేశించారు. గడువు తేదీలను క్రమం తప్పకుండా పరిశీలిస్తూ, మందుల నిల్వలను సక్రమంగా నిర్వహించాలని సూచించారు.
ఆరోగ్య కేంద్రంలో నీటి సరఫరా పరిస్థితిని కలెక్టర్ పరిశీలించి, ప్రస్తుతం ఉన్న నీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ఆరోగ్య కేంద్రంలో అవసరమైన నీటి సరఫరా శనివారం నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఆరోగ్య కేంద్రం ప్రాంగణం, నీటి నిల్వ ప్రదేశాలు, టాయిలెట్లు, వార్డులు, ల్యాబ్, ఫార్మసీ, తదితర అన్ని విభాగాలను పూర్తిస్థాయిలో శుభ్రం చేయించి, పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు, ఆసుపత్రిలో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, పారిశుద్ధ్యం, మందుల లభ్యత, నీటి సరఫరా వంటి అంశాలపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని తెలిపారు.
ఈ తనిఖీలో వైద్యాధికారి, వైద్యులు, సిబ్బంది, సర్పంచి, తదితరులు పాల్గొన్నారు