జిల్లా జనగణన హ్యాండ్బుక్ సమాచార సేకరణపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష
రాజన్న సిరిసిల్ల, ఆగస్టు - 07 ఫీల్డ్ ఫంక్షనరీలు క్షేత్రస్థాయిలో నాణ్యతతో సమాచారం పక్కాగా సేకరించేలా చూడాలని రాష్ట్ర జనాభా లెక్కల సంచాలకులు భారతి హోళికేరి ఆదేశించారు.
జనగణన–2027కు సంబంధించిన సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా జిల్లా జనగణన హ్యాండ్బుక్ (District Census Handbook – DCHB) పై అన్ని జిల్లాల కలెక్టర్లతో హైదరాబాద్ నుంచి రాష్ట్ర జనాభా లెక్కల సంచాలకులు భారతి హోళికేరి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించగా, జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి జిల్లా ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, వివిధ శాఖల అధికారులతో కలిసి హాజరయ్యారు. జిల్లాల వారీగా డీసీహెచ్ బీ, హానరోరియం పంపిణీ తదితర అంశాలపై ఆరా తీశారు.
రాష్ట్ర జనాభా లెక్కల సంచాలకులు భారతి హోళికేరి మాట్లాడుతూ.. ప్రతి జిల్లాలో జిల్లా జనగణన హ్యాండ్బుక్ రూపొందించేందుకు విద్యా, వైద్య సదుపాయాలు, తాగునీరు, పారిశుద్ధ్యం, రవాణా , కమ్యూనికేషన్, బ్యాంకింగ్, రుణ సదుపాయాలు, విద్యుత్, ఇంధన వనరులు, భూమి, సాగునీటి వినియోగం, వ్యవసాయం, తయారీ చేతివృత్తులు, అలాగే గ్రామానికి సంబంధించిన ముఖ్యమైన ప్రత్యేక అంశాలు, పరిశీలనలు వంటి తొమ్మిది ప్రధాన అంశాలకు సంబంధించిన సమాచారాన్ని, టౌన్ డైరెక్టరీ షెడ్యూల్ను ఛార్జ్ ఆఫీసర్లు(మున్సిపల్ కమిషనర్) నియమించిన అధికారుల ద్వారా పట్టణ పౌర, పరిశ్రమలు, సామాజిక సదుపాయాలు, మురికివాడలకు సంబంధించిన సమాచారాన్ని నమోదు చేయాలని ఆదేశించారు. ఆయా శాఖల జిల్లా అధికారులు పూర్తి సమాచారాన్ని జీపీఓలు/పంచాయతీ కార్యదర్శులు, ఛార్జ్ ఆఫీసర్లకు అందించాలని ఆదేశించారు.
జిల్లాలోని అన్ని మండలాల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల సమాచారాన్ని ఛార్జ్ ఆఫీసర్లు డీసీహెచ్ బీ పోర్టల్, మొబైల్ అప్లికేషన్ను ఉపయోగించి సమాచారాన్ని ఖచ్చితంగా..నాణ్యతతో నమోదు చేయాలని సూచించారు.
అలాగే విలేజ్ డైరెక్టరీ సమాచారాన్ని 31.12.2025ను ప్రామాణిక తేదీగా తీసుకుని, రెవెన్యూ గ్రామాల వారీగా మొబైల్ అప్లికేషన్ ద్వారా లో సేకరించాలని ఆదేశించారు. ఈ సమాచార సేకరణ ప్రక్రియ 10.08.2026 నుండి 08.09.2026 వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఇప్పటికే శిక్షణ పూర్తి
జిల్లా జనగణన హ్యాండ్బుక్ పై జిల్లాలోని సంబంధిత అధికారులకు శిక్షణ ఇచ్చామని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. రాష్ట్ర జనాభా లెక్కల సంచాలకుల ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలో నిర్దేశిత గడువులోగా ప్రక్రియ పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జయశ్రీ, జిల్లా జనగణన అధికారి & ముఖ్య ప్రణాళిక అధికారి పీబీ శ్రీనివాసాచారి, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.