Banner
Watermark
ప్రజావాణిలో (326) దరఖాస్తుల స్వీకరణ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
📅 03 August 2026, 02:43 PM ✍️ admin
News Image
ఆగస్టు 03
జ‌న‌గామ‌ జిల్లాలో వివిధ సమస్యలపై ప్రజలు అందజేసిన దరఖాస్తులను క్షుణ్ణంగా ప‌రిశీలించి, సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు.

సోమవారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్‌షాలోంతో కలిసి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా దరఖాస్తులను స్వీకరించారు.

ఈ సందర్భంగా ప్రజావాణిలో ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను అధికారులు త్వరగా ప‌రిష్క‌రించేందుకు త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. అలాగే స్వీక‌రించిన ద‌ర‌ఖాస్తుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్య‌తను ఇవ్వాల‌న్నారు.

అదే విధంగా పెండింగ్ లో గల ఆర్జీల పరిష్కారంపై ప్ర‌త్యేక దృష్టి సారించాలని అధికారుల‌కు సూచించారు.

ఈ ప్రజావాణిలో మొత్తం (326) దరఖాస్తులను క‌లెక్ట‌ర్ స్వీక‌రించారు.

ఈరోజు ప్రజావాణికి వచ్చిన కొన్నింటి దరఖాస్తుల వివరాలిలా ఉన్నాయి..

దేవరుప్పుల మండలం, దేవరుప్పుల గ్రామానికి చెందిన వి. అనురాధ, ఇందిరమ్మ ఇళ్లు పథకం కింద ఆర్థిక సహాయం మంజూరు చేయ‌గ‌ల‌ర‌ని విజ్ఞ‌ప్తి చేస్తూ అర్జీని స‌మ‌ర్పించారు.

చిల్పూర్ మండలం, నష్కల్ గ్రామానికి చెందిన ఎస్. అరుణ, తను నిరుపేదరాలని, ఆర్థికంగా వెనుకబడి ఉందని, కిరాయికి ఉండి బతుకుతున్నారని, తమ పాత ఇల్లు చాలా కూలిపోయి శిథిలావస్థలో ఉందని, కావున ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన ఇందిర‌మ్మ ఇళ్ల ప‌థకం కింద తనకు ఇందిర‌మ్మ ఇల్లు మంజూరుకు మనవి చేస్తూ ద‌రఖాస్తు చేసుకున్నారు.

లింగాల ఘనపురం మండలం, కుందారం గ్రామానికి చెందిన బత్తుల భిక్షపతి, తమ ఇంటి పక్కన ఇంటి వాళ్ళైన బత్తుల యాదయ్య, తండ్రి ఆగయ్యలు బర్లపెండ, ఇంటి వ్యర్థాలు అంతా తమ ఇంటి పక్కన వేయడంతో దుర్వాసన రావడం జరుగుతోందని, ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని విన్న‌విస్తూ ద‌ర‌ఖాస్తును స‌మ‌ర్పించారు.

జనగామకు చెందిన చిట్ల సుకన్య, తన 3 ఎకరాల 8 గుంటల భూమిని ధోరణిలో నమోదు చేయగా, తన వ్యవసాయ భూమి సర్వే నంబర్లు ఈ కు బదులు హెచ్ గా నమోదు అయ్యాయని, ఈ మేరకు తన వ్యవసాయ భూమి సర్వే నంబర్లు పరిశీలించి, వాటిని సరి చేయ‌గ‌ర‌ల‌ని కోరుతూ ద‌ర‌ఖాస్తును స‌మ‌ర్పించ‌నైన‌ది.

నర్మెట్ట మండలం, బొమ్మకూరు గ్రామానికి చెందిన భూపతి ఆనందం, తన తల్లి పేరు మీద గల భూమి పాత పాస్ పుస్తకం నుంచి కొత్త పాస్ పుస్తకంకు కొంత తగ్గిందని, రెండు పాస్ పుస్తకాలను పరిశీలించి, మ్యుటేషన్ చేయగలరని, అలాగే తన పేరు మీదకు పట్టా చేయగలరని కోరుతూ ద‌ర‌ఖాస్తును స‌మ‌ర్పించారు.

ఈ ప్ర‌జావాణిలో డీఆర్డీఓ భాస్కర్, గృహ నిర్మాణ శాఖ పీడీ మాతృ నాయక్, వివిధ శాఖ‌ల జిల్లా అధికారులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.
🏠 Home