*ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్
పెద్దపల్లి, జూలై 27: అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని, ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అర్జీలను పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోమవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ బి. శ్రీరాముల తో కలిసి కలెక్టరేట్ సమావేశం మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు.
రామగుండం నగరానికి చెందిన సాదు సత్తెమ్మ తనకు ప్రభుత్వ నర్సింగ్ కళాశాల గోదావరిఖనిలో ఉద్యోగం ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ కు రాస్తూ పరిశీలించి అవకాశం మేరకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
సుల్తానాబాద్ మున్సిపాలిటీకి చెందిన జి. మల్లేశం హన్మండ్లపల్లి గ్రామం సర్వే నెంబర్ 77ఇ లో 2 ఎకరాలు 28 గుంటల భూమి తాతల నుంచి వస్తుందని దాని వారసత్వ హక్కు దారులకు పట్టా పాస్ పుస్తకాలు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా తహసిల్దార్ సుల్తానాబాద్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
ఎలిగేడు మండలం బుర్హాన్ మియాపేట గ్రామానికి చెందిన గౌర వెంకటయ్య మోసపూరితంగా తన కొడుకు పేరున తదనంతరం భార్య పేరును మార్పిడి చేసుకున్న ఇంటిని మళ్లీ తనపై మార్పిడి చేయాలని నాపై భౌతిక దాడికి పాల్పడే ఇంటి నుంచి వెళ్ళకూడదు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా ఆర్.డి.ఓ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
ప్రజావాణి కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
---------------------------------------------------
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లి చే జారీ చేయనైనది