సూపర్ ఎల్నినో పరిస్థితుల్లో త్రాగునీటి సరఫరాకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలి : జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి, జూలై-23:సూపర్ ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జిల్లాలో త్రాగునీటి సరఫరాను నిరంతరాయంగా కొనసాగించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు.
గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్లో మిషన్ భగీరథ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, సూపర్ ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని త్రాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. జిల్లాలో త్రాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట ప్రత్యామ్నాయ త్రాగునీటి కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
జిల్లాలో త్రాగునీటి సరఫరాకు సంబంధించి చేపట్టిన అన్ని పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా అధికారులు ప్రత్యక్ష పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. గ్రామాలు, పట్టణాల్లో త్రాగు నీటి సరఫరా మరింత సజావుగా జరిగేందుకు అవసరమైన అదనపు పనులు ఏవైనా ఉంటే వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించాలని అధికారులకు సూచించారు.
జిల్లాలోని అన్ని బోర్వెల్, చేతి పంపుల వద్ద వర్షపు నీటి సంరక్షణకు ఉపయోగపడే రీఛార్జ్ గుంతల నిర్మాణాన్ని వేగవంతం చేసి, సెప్టెంబర్ నెలాఖరు నాటికి 100 శాతం పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. భూగర్భ జలాల పెరుగుదలకు ఈ చర్యలు ఎంతో ఉపయోగపడతాయని, పనుల్లో ఎలాంటి జాప్యానికి తావు లేకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు.
మిషన్ భగీరథ గ్రిడ్కు సంబంధించిన పెండింగ్ పనులను ఆగస్టు నెలాఖరు నాటికి పూర్తిచేసి పూర్తి స్థాయిలో త్రాగునీటి సరఫరాకు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో మిషన్ భగీరథ గ్రిడ్ ఈ. ఈ.పూర్ణచందర్, మిషన్ భగీరథ ఇంట్రా ఎస్ఈ గంగాధర శ్రీనివాస్, డీఈలు, ఏఈలు, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
----------------------------------------------------------------
జిల్లా పౌర సంబంధాల అధికారి, పెద్దపల్లి చే జారీ చేయనైనది