Banner
Watermark
*జూలై 24 నాటికి 100 శాతం ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తి చేయాలి... భారత ఎన్నికల కమిషన్ సీనియర్ అధికారి డాక్టర్ పవన్ కుమార్ శర్మ* *ఎస్‌ఐఆర్ కార్యక్రమానికి కలెక్టర్లు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి* *ప్రతి రోజు ఐదుగురు బీఎల్‌వోలకు ఫోన్ చేసి పురోగతి సమీక
📅 10 July 2026, 01:08 PM ✍️ admin
News Image
*జూలై 24 నాటికి 100 శాతం ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తి చేయాలి... భారత ఎన్నికల కమిషన్ సీనియర్ అధికారి డాక్టర్ పవన్ కుమార్ శర్మ*

*ఎస్‌ఐఆర్ కార్యక్రమానికి కలెక్టర్లు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి*

*ప్రతి రోజు ఐదుగురు బీఎల్‌వోలకు ఫోన్ చేసి పురోగతి సమీక్షించాలి*

*డిజిటలైజేషన్ ప్రారంభించని బీఎల్‌వోలపై ప్రత్యేక దృష్టి సారించాలి*

*ప్రతి జిల్లాలో కనీసం 50 శాతం డిజిటలైజేషన్ పూర్తి చేయాలి : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి*

*ఎస్‌ఐఆర్ కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన భారత ఎన్నికల కమిషన్ సీనియర్ అధికారి*
-------------------------
పెద్దపల్లి, జూలై-10:
--------------------------
ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)-2026 కార్యక్రమంలో భాగంగా జూలై 24 నాటికి ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్‌ను వంద శాతం పూర్తి చేయాలని భారత ఎన్నికల కమిషన్ సీనియర్ అధికారి డాక్టర్. పవన్ కుమార్ శర్మ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

శుక్రవారం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎస్‌ఐఆర్ కార్యక్రమం పురోగతిని ఆయన సమీక్షించారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి పాల్గొనగా, పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా *డాక్టర్ పవన్ కుమార్ శర్మ మాట్లాడుతూ*,,రాష్ట్రంలో ప్రస్తుతం కేవలం 22 శాతం ఎన్యూమరేషన్ ఫారాలు మాత్రమే డిజిటలైజ్ అయ్యాయని తెలిపారు. ఇప్పటికే గడువులో సగం సమయం పూర్తయిన నేపథ్యంలో మిగిలిన 14 రోజుల్లోనే డిజిటలైజేషన్‌ను వంద శాతం పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఇకపై ప్రతి రోజూ కనీసం 8 శాతం చొప్పున డిజిటలైజేషన్ జరిగేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో డిజిటలైజేషన్ పురోగతి చాలా తక్కువగా ఉందని పేర్కొంటూ, ఇంకా పంపిణీ చేయాల్సిన ఎన్యూమరేషన్ ఫారాలను వెంటనే పూర్తి చేయాలని, అవసరమైన చోట వాలంటీర్ల సహకారం వినియోగించుకోవాలని సూచించారు.

పంపిణీ చేసిన ప్రతి ఎన్యూమరేషన్ ఫారాన్ని తిరిగి ఓటర్ల నుంచి సేకరించి డిజిటలైజ్ చేయడం అధికారుల బాధ్యతేనని తెలిపారు. అనేక మంది బీఎల్‌వోలు ఇప్పటి వరకు ఒక్క ఫారాన్ని కూడా డిజిటలైజ్ చేయలేదని, అలాంటి బీఎల్‌వోలపై ప్రత్యేక దృష్టి సారించి వారి పనితీరును మెరుగుపర్చాలని ఆదేశించారు.

ఎస్‌ఐఆర్ కార్యక్రమానికి ఇతర కార్యక్రమాల కంటే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. ప్రతి రోజు యాదృచ్ఛికంగా ఐదుగురు బీఎల్‌వోలకు ఫోన్ చేసి వారి పురోగతిని తెలుసుకోవాలని, దీంతో పనిలో వేగం పెరుగుతుందని అన్నారు.

పనితీరు బలహీనంగా ఉన్న బీఎల్‌వోలకు ఇతర అధికారులు, సూపర్‌వైజర్లు, వాలంటీర్ల ద్వారా అవసరమైన సహకారం అందించాలని సూచించారు.
పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ను నిబంధనల ప్రకారం సమర్థవంతంగా చేపట్టాలని, 1,200 మందికి పైగా ఓటర్లు ఉన్న ప్రాంతాల్లో కొత్త పోలింగ్ కేంద్రాల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.

కొన్ని జిల్లాలు ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో మంచి పురోగతి సాధిస్తున్నాయని, నల్గొండ జిల్లా కలెక్టర్ పనితీరును అభినందించారు. ఇదే స్ఫూర్తితో అన్ని జిల్లాలు లక్ష్య సాధనలో ముందుండాలని ఆకాంక్షించారు.

*రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ,* రాష్ట్రవ్యాప్తంగా 99.6 శాతం మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తయిందని, ఇప్పటివరకు 21.94 శాతం డిజిటలైజేషన్ పూర్తయిందని తెలిపారు. వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఇంకా మూడు వేలకుపైగా ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయాల్సి ఉందన్నారు.

పట్టణ ప్రాంతాల్లో డిజిటలైజేషన్ శాతం తక్కువగా నమోదవుతోందని పేర్కొన్న ఆయన, తదుపరి సమీక్ష నాటికి ప్రతి జిల్లా కనీసం 50 శాతం డిజిటలైజేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు. బీఎల్‌వోల వారీగా సమీక్షలు నిర్వహించాలని, ఎన్నికల నమోదు అధికారులు సూపర్‌వైజర్లు, బీఎల్‌వోల పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తూ లక్ష్య సాధనకు కృషి చేయాలని సూచించారు.

వీడియో కాన్ఫరెన్స్ అనంతరం *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* జిల్లాలో ఎస్‌ఐఆర్ కార్యక్రమం పురోగతిని సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా వంద శాతం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. డిజిటలైజేషన్‌లో వెనుకబడిన బీఎల్‌వోలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రతిరోజూ పురోగతిని సమీక్షించాలని, అవసరమైన చోట అదనపు సిబ్బంది సహకారం అందించి లక్ష్య సాధనకు కృషి చేయాలని సూచించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్డీవోలు గంగయ్య, సురేష్, ఎలక్షన్ డీటీ ధీరజ్, తదితరులు పాల్గొన్నారు.
🏠 Home