Banner
Watermark
నిరంతరం ప్రజల కోసమే పనిచేసే ప్రభుత్వం 'ఇందిరమ్మ రాజ్యం'
📅 09 June 2026, 02:19 PM ✍️ admin
News Image
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీలు కుమ్మక్కై రైతులను, ప్రజలను వంచిస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం పల్లగుట్ట గ్రామంలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వం చేస్తోన్న రికార్డు స్థాయి ధాన్యపు కొనుగోళ్లు, సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు. బీఆర్‌ఎస్, బీజేపీ నేతలకు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని నిప్పులు చెరిగారు.

రూ. 8 లక్షల కోట్ల అప్పులు చేసి.. రాష్ట్రాన్ని దోపిడీ చేశారు!

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో రాష్ట్ర సంపదను, వనరులను విచ్చలవిడిగా దోపిడీ చేసిందని భట్టి విక్రమార్క ఆరోపించారు. "ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను రూ. 8 లక్షల కోట్ల అప్పుల్లో ముంచేసి వెళ్లారు. ఆ పాపానికి ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏటా రూ. 76 వేల కోట్ల రూపాయలను అసలు, వడ్డీల రూపంలో బ్యాంకులకు కట్టాల్సి వస్తోంది. ఆ అప్పులే లేకపోయి ఉంటే ఈ రూ. 76 వేల కోట్లను ప్రజల సంక్షేమానికి అందించి రాష్ట్ర దశ, దిశ మార్చేవాళ్లం" అని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల సొమ్మంతా గత పాలకుల ఇళ్లకే పోయిందని, అందుకే పదేళ్లలో పేదలకు సన్నబియ్యం గానీ, ఇందిరమ్మ ఇళ్లు గానీ ఇవ్వలేకపోయారని ఎద్దేవా చేశారు.

డిస్కంలను ముంచేసింది మీరు కాదా?: బీఆర్‌ఎస్‌కు సూటి ప్రశ్న

పదేళ్ల పాటు ఉచిత కరెంట్ ఇస్తున్నామని బీఆర్‌ఎస్ నేతలు గప్పాలు కొట్టుకున్నారే తప్ప, డిస్కంలకు సకాలంలో బిల్లులు చెల్లించకుండా వాటిని అప్పుల పాలు చేశారని భట్టి విక్రమార్క మండిపడ్డారు. "మీరు చేసిన తప్పుల వల్ల డిస్కంలు ఆదాయం లేక, క్వాలిటీ పవర్ ఇవ్వలేక ఇబ్బంది పడ్డాయి. కానీ, మా ప్రభుత్వం వచ్చాక రైతులు కట్టాల్సిన రూ. 14 వేల కోట్లను, పేదల ఉచిత కరెంట్ (గృహజ్యోతి) బిల్లు రూ. 5 వేల కోట్లను.. మొత్తంగా రూ. 19 వేల కోట్లను ప్రతి నెల ఆర్థిక శాఖ ద్వారా నేరుగా డిస్కంలకు చెల్లిస్తూ క్వాలిటీ పవర్ ఇస్తున్నాం. దీనిపై కూడా అభాండాలు వేయడం బీఆర్‌ఎస్ దిగజారుడుతనానికి నిదర్శనం" అని స్పష్టం చేశారు.

హరీష్ రావు రోజుకో అబద్ధాన్ని సృష్టిస్తున్నారు!

"ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని మా క్యాబినెట్ రోజుకు 18 గంటలు ప్రజా సంక్షేమం కోసం శ్రమిస్తుంటే.. పదేళ్లు మంత్రిగా పనిచేసిన హరీష్ రావు కేవలం వార్తల్లో ఉండటం కోసం రోజుకొక అబద్ధపు వార్తను సృష్టిస్తున్నారు. గాలి కబుర్లు పోగేసి ప్రభుత్వంపై అవాకులు చవాకులు పేలుతున్నారు. అధికారం పోయిందనే తట్టుకోలేక కట్టుకథలు అల్లుతున్నారు" అని హరీష్ రావుపై భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతులను కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేసిన బీజేపీ!

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా రైతులను కార్పొరేట్ శక్తుల దయాదాక్షిణ్యాల మీద వదిలేయాలని కేంద్రం చూస్తోందని ఆరోపించారు. "మద్దతు ధర (MSP) ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. మరి రాష్ట్రాలు కొనుగోలు చేస్తున్న ధాన్యాన్ని ఎఫ్ సి ఐ (FCI) ద్వారా ఎందుకు సేకరించడం లేదు? గత కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో ఎఫ్‌సీఐ ద్వారా కేంద్రమే కొనుగోలు చేసేది. ఇప్పుడెందుకు ఆ వ్యవస్థను నిర్వీర్యం చేశారు?" అని సూటిగా ప్రశ్నించారు. కేంద్రం కొన్నా, కొనకపోయినా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల శ్రమను గౌరవిస్తూ చివరి ధాన్యపు గింజ వరకూ కొంటుందని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా మద్దతు ధరతో మొక్కజొన్నలు కొంటున్నారా అని ప్రశ్నించిన ఆయన, కేవలం తెలంగాణలోనే మొక్కజొన్నను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసిందని గుర్తు చేశారు.

'తగుదునమ్మా' అంటూ కల్లాల్లోకి వస్తారా?
రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి రబీ సీజన్‌లో రికార్డు స్థాయిలో 72.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తుంటే.. 'తగుదునమ్మా' అంటూ బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకులు కల్లాల్లోకి వస్తాం, రైతుల కన్నీళ్లు తుడుస్తాం అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. "ఇన్ని రోజులు మీరెక్కడికి పోయారు? వర్షానికి తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకే కొనుగోలు చేసిన చరిత్ర మా కాంగ్రెస్ ప్రభుత్వానిది" అని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఒకే విడతలో రూ. 22 వేల కోట్ల రైతు రుణమాఫీ చేసిన ఘనత తమదేనని, విమర్శలు మాని దమ్ముంటే కేంద్రం చేత ధాన్యం కొనుగోలు చేయించాలని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు.

పేదల గృహనిర్మాణానికి పెద్దపీట
గత ప్రభుత్వం 'డబుల్ బెడ్‌రూమ్' పేరుతో పేదలను వంచించిందని భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. ఇందిరమ్మ ఇళ్లకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, తొలి విడతగా రూ. 22,500 కోట్ల వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఇళ్లను మంజూరు చేశామని, ఒక్కో ఇంటికి రూ. 5 లక్షల చొప్పున సాయం అందిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది ప్రతి నియోజకవర్గానికి అదనంగా మరో 2,000 ఇందిరమ్మ ఇళ్లను కేటాయించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఇల్లే లేని నిరుపేద కుటుంబం ఉండకూడదన్నదే ప్రభుత్వ సంకల్పమన్నారు.

మహిళా సాధికారతకు అండ
మహిళా సంఘాలకు రెండున్నరేళ్లలోనే రూ. 67 వేల కోట్ల బ్యాంక్ లింకేజ్ రుణాలు ఇప్పించామని, ఐదేళ్లలో ఈ మొత్తాన్ని రూ. 1.25 లక్షల కోట్లకు పెంచుతామని భట్టి విక్రమార్క వెల్లడించారు. మహిళా సంఘాలే స్వయంగా బస్సులు కొనుగోలు చేస్తే, వాటిని ఆర్టీసీలో తిప్పి వారికి స్థిరమైన ఆదాయం కల్పించే వినూత్న కార్యక్రమాన్ని దిగ్విజయంగా అమలు చేస్తున్నామని వివరించారు.

స్థానిక సమస్యలపై సానుకూల స్పందన
సభలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి కోరిన పలు అభివృద్ధి పనులపై ఉప ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. రఘునాథపాలెంలో 232 కేవీ సబ్‌స్టేషన్ అప్‌గ్రేడేషన్‌పై తక్షణమే సాధ్యసాధ్యాల (Feasibility Study) పరిశీలన జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే గ్రామాల్లో ఇళ్లపై ప్రమాదకరంగా ఉన్న కరెంట్ లైన్ల మార్పిడి (Line Shifting) పనుల కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేస్తానని సభాముఖంగా మాట ఇచ్చారు. గతంలో పక్కనబెట్టిన ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తూచా తప్పకుండా అమలు చేస్తోందని, ఈ నియోజకవర్గానికి కూడా సబ్‌ప్లాన్ నిధులు పెద్ద ఎత్తున వస్తాయని పేర్కొన్నారు.
🏠 Home