Banner
Watermark
ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా తంగళ్లపల్లి మండలం రామన్నపల్లిలో ప్రత్యేక గ్రామ సభ నిర్వహణ
📅 06 June 2026, 03:21 PM ✍️ admin
News Image
తంగళ్లపల్లి , జూన్ - 06
ప్రతి ఇంటిలో చెత్తను నాలుగు రకాలుగా వేరు చేయాలని, పారిశుధ్య వాహనాలకు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు నిచ్చారు.

ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా తంగళ్లపల్లి మండలం రామన్నపల్లి గ్రామంలోని ప్రగతి ప్రాంగణంలో శనివారం నిర్వహించిన ప్రత్యేక గ్రామసభకు జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా వర్షాకాల సన్నద్ధత, పంటల మార్పిడి, వ్యవసాయ, బడి బాట, ఘన వ్యర్థాల నిర్వహణ, ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, పారిశుద్ధ్యం, వన మహోత్సవం, జల సంరక్షణ, మహిళల రక్షణ, షి టీమ్, భరోసా కేంద్రం తదితర అంశాలపై గ్రామ ప్రజలతో సుదీర్ఘంగా చర్చించి అవగాహన కల్పించారు.


గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి నాలుగు చెత్త బుట్టలు పంపిణీ చేయాలని, బట్ట సంచులు ఇవ్వాలని, గ్రామంలో స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేసి.. స్టీల్ ప్లేట్స్, గ్లాసులు, జగ్గులు ఇవ్వాలని ప్రతి వేడుకలకు ఇవ్వాలని ప్రతిపాదనలు చేశారు.

జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ .. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కింద 10 థీమ్ లతో 10 శాఖల ఆద్వర్యంలో వివిధ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని వెల్లడించారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రభుత్వ పథకాలు, సంక్షేమ అభివృద్ధి పనులు ప్రజల్లోకి తీసుకువెళ్లడం, సంపూర్ణ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.

వర్షాకాలానికి ముందే గ్రామాల్లోని డ్రైనేజీలు శుభ్రం చేయించాలని తెలిపారు. డ్రైనేజీల్లో ప్లాస్టిక్, బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేయవద్దని కోరారు. ఘన వ్యర్థాల నిర్వహణ -2026 పై ప్రజలు కచ్చితంగా అవగాహన కలిగి ఉండాలని, చెత్తను నాలుగు రకాలుగా వేరు చేయాలని సూచించారు. తడి, పొడి, సానిటరీ, ప్రత్యేక చెత్త గా వేరు చేసి గ్రామ పంచాయతీ వాహనానికి అందించాలని సూచించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్వహణపై అవగాహన పొందాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలో గ్రామస్థులను సెగ్రీగేషన్ షెడ్లకు తీసుకు వెళ్లాలని సూచించారు. నీటి ట్యాంకులను నెలకు మూడు సార్లు బ్లీచింగ్ తో సిబ్బంది శుభ్రం చేయాలని ఆదేశించారు.

ఎల్ నినో ప్రభావం దృష్ట్యా పంటలు సాగు చేసేముందు వ్యవసాయ అధికారులను సంప్రదించి, ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తే ఇబ్బందులు ఉండవని వివరించారు. ఆయిల్ పామ్, సన్న వడ్లు, కూరగాయలు, పప్పు ధాన్యాలు తదితర లాభదాయక పంటలను సాగు చేయడానికి రైతులు ముందుకు రావాలని సూచించారు. ఆయిల్ పామ్ కు సంబంధించి సిద్దిపేట జిల్లా నర్మెట లో పరిశ్రమ ఉందని, పండించిన దిగుబడిని పరిశ్రమకు తీసుకువెళ్ళడానికి దూర భారం కూడా లేదని గుర్తు చేశారు. పంట మార్పిడి చేయకపోతే నేల సారం తగ్గుతుందనే విషయాన్ని రైతులు గమనించాలని పేర్కొన్నారు.

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ఇంటింటికీ వచ్చి వివరాలు సేకరించే బీఎల్ఓలకు ప్రజలు సహకరించాలని సూచించారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఈ నెల 25 వ తేదీ నుంచి కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడం ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశ్యమన్నారు. గుర్తింపు కార్డులు చూపించి మ్యాపింగ్ ప్రక్రియకు సహకరించాలని కోరారు.

బడిబాట కార్యక్రమం ద్వారా ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల నమోదు శాతం పెంచాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు పంపించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ప్రభుత్వం అనేక మౌలిక సదుపాయాలు కల్పిస్తుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. జల వనరులు సంరక్షించాలని, ఇంకుడు గుంతలు శుభ్రం చేసి సిద్ధంగా ఉంచాలని, చెరువులు, గ్రామంలోని ఇంకుడు గుంతలు, పామ్ పాండ్ లు సిద్ధంగా ఉంచాలని పిలుపు నిచ్చారు. దీంతో భూగర్భ జలాలు వృద్ధి చెందుతాయని తెలిపారు. ఈ నెల 1వ తేదీన జిల్లా వ్యాప్తంగా 2720 ఇందిరమ్మ ఇండ్లకు గృహ ప్రవేశాలు చేశామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేయడంలో రాష్ట్రంలో జిల్లా రెండో స్థానంలో ఉందని వెల్లడించారు.

కార్యక్రమంలో డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, జిల్లా విద్యాధికారి జగన్ మోహన్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి షరీఫ్ఫుద్దిన్, జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, ఉద్యానవన శాఖ అధికారి శరత్, డిప్యూటీ తహసీల్దార్ మురళీకృష్ణ, సర్పంచ్ జ్యోతి, మిషన్ భగీరథ, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home