పెళ్లి సంబంధాల పేరుతో కొత్త తరహా మోసం.. - బ్యూరోలకే కన్నమేస్తున్న కేటుగాడు!
సిరిసిల్ల, మే 08, (నేటి ప్రభాత దర్శిని): పెళ్లి పేరయ్యల ముసుగులో తిరుగుతున్న మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని మోసపోయిన బాధితులు హెచ్చరిస్తున్నారు. సిరిసిల్ల జిల్లా చంద్రంపేట గ్రామానికి చెందిన గాండ్ల రామచంద్రం అనే వ్యక్తి పెళ్లి సంబంధాల పేరుతో వినూత్న రీతిలో మోసాలకు పాల్పడుతున్నట్లు బాధితులు గోడును వెళ్ళబుచుతున్నారు.
ఈ వ్యక్తి తొలుత వివిధ మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులను సంప్రదించి, తాను కూడా ఒక బ్యూరో నడుపుతున్నానని నమ్మిస్తాడనీ, వారి వద్ద ఉన్న మంచి సంబంధాల ప్రొఫైల్స్ను తనకు పంపమని కోరుతాడని అంటున్నారు. సహోద్యోగి అన్న నమ్మకంతో బ్యూరోల వారు ప్రొఫైల్స్ పంపగానే, అసలు కథ మొదలవుతుందనీ,
బ్యూరో నిర్వాహకులకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా, నేరుగా ప్రొఫైల్లోని అబ్బాయి లేదా అమ్మాయి తల్లిదండ్రుల ఇళ్లకు వెళ్తాడనీ, ఆ సంబంధం తానే స్వయంగా తెచ్చానని, తనదే ఆ బ్యూరో అని అబద్ధాలు చెప్పి నమ్మిస్తాడనీ తెలిపారు. సంబంధం ఖాయం చేసే బాధ్యత తనదే అని చెప్పి, ముందస్తుగా తల్లిదండ్రుల నుంచి భారీ మొత్తంలో నగదు వసూలు చేస్తాడనీ,
డబ్బులు చేతికందగానే రామచంద్రం తన అసలు స్వరూపాన్ని చూపిస్తున్నాడనీ, ఆ తర్వాత పెళ్లి సంబంధం విషయంలో ఎలాంటి పురోగతి ఉండదు సరే కదా, బాధితులు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాడనీ పేర్కొన్నారు. అటు బ్యూరో నిర్వాహకులు, ఇటు పెళ్లి సంబంధం కోరుకునే తల్లిదండ్రులు ఇద్దరూ ఇతని చేతిలో మోసపోతున్నారనీ వెల్లడించారు.
ఇలాంటి వ్యక్తులకు ఎటువంటి ప్రొఫైల్స్ సెండ్ చేయకుండా మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులు జాగ్రత్త పడాలని, అలాగే గుర్తు తెలియని వ్యక్తులకు పెళ్లి పేరుతో ముందే డబ్బులు ఇచ్చి మోసపోవద్దని బాధితులు కోరుతున్నారు. ఎవరైనా ఇతని చేతిలో మోసపోయి ఉంటే వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.