Banner
Watermark
గురుకులాల్లో విద్యార్థుల ఆరోగ్యం, సదుపాయాలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం : జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
📅 20 April 2026, 03:03 PM ✍️ admin
News Image
-----------------------------
గురుకులాల్లో విద్యార్థుల ఆరోగ్యం, సదుపాయాలపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష*అన్నారు.

సోమవారం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న వెల్ఫేర్ వీక్ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్ కాలేజ్, పెద్దపల్లిని సందర్శించి పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గురుకుల పాఠశాలల్లో పరిశుభ్రతను కచ్చితంగా పాటించాలని, వంటశాలలు, నిల్వ గదులు, తరగతి గదులు, వసతి గృహాలను నిరంతరం శుభ్రంగా ఉంచాలని సిబ్బందికి ఆదేశించారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉండేందుకు హైజీన్ ప్రమాణాలు పాటించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు.

వచ్చే విద్యా సంవత్సర ప్రారంభానికి ముందే అవసరమైన మరమ్మతులు పూర్తి చేయాలని, ఎలాంటి లోపాలు లేకుండా విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యంగా ఉండాలని, పోషకాహార ప్రమాణాలను పాటిస్తూ సరైన డైట్‌ను అమలు చేయాలని సూచించారు. ఆహార భద్రతపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, వంట ప్రక్రియలో శుభ్రత, నాణ్యతపై రాజీ పడకూడదన్నారు.

విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, అవసరమైనప్పుడు వెంటనే వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. చిన్నపిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సిబ్బందికి సూచించారు.

అదేవిధంగా పాఠశాలలో ఉన్న డ్రైనేజ్ సమస్యను పరిష్కరించేందుకు అవుట్‌లెట్‌ను త్వరితగతిన ఏర్పాటు చేసేలా మున్సిపల్ కమిషనర్‌కు ఆదేశించారు.

ఈ సందర్భంగా 2026 ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు కలెక్టర్ గారు పతకాలు ప్రదానం చేశారు. కలెక్టర్ చేతుల మీదుగా పతకాలు అందుకున్నందుకు విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరా శాఖ అధికారి శ్రీనాథ్, మున్సిపల్ కమిషనర్ వెంకటేష్,సంబంధిత అధికారులు, పాఠశాల సిబ్బంది ,తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లి చే జారీ చేయనైనది
🏠 Home