రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా వ్యవసాయ విద్యుత్
రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా వ్యవసాయ విద్యుత్ సర్వీసుల మంజూరును యుద్ధ ప్రాతిపదికన వేగవంతం చేస్తున్నామని శుక్రవారం రాజన్న సిరిసిల్ల సూపరింటెండింగ్ ఇంజనీర్ టి . వేణు మాధవ్ తెలిపారు.
కేవలం 17 రోజుల్లోనే 541 వ్యవసాయ సర్వీసులు మంజూరు చేయడం విశేషమని, ఇది శాఖ పనితీరుకు, రైతుల పట్ల ఉన్న నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 1400 సర్వీసులు మాత్రమే మంజూరు కావడంతో , ప్రస్తుత వేగంగా గణనీయమైన పురోగతిని సూచిస్తుందని తెలిపారు.
వ్యవసాయ సర్వీసుల మంజూరుకు అవసరమైన ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు, కండక్టర్లు ఉన్నాయని , పనులు నిరవధికంగా కొనసాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని వెల్లడించారు. జూన్ నెల నాటికి 1950 పెండింగ్లో ఉన్న అన్ని సర్వీసులను పూర్తిగా మంజూరు చేస్తామని స్పష్టం చేశారు.
వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్న నేపథ్యంలో, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడం ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని అన్నారు.
వినియోగదారుల భద్రత, శ్రేయస్సే ప్రధాన ప్రాధాన్యం అని, వినియోగదారులకు అండగా నిలుస్తూ మరింత మెరుగైన, పారదర్శక సేవలు అందించేందుకు శాఖ కట్టుబడి ఉందని టి . వేణు మాధవ్ స్పష్టం చేశారు.