Banner
Watermark
ప్రభుత్వ సంక్షేమ పథకాలు సమర్థంగా అమలు మండల స్థాయిలో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వేదిక – మండల సభ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
📅 16 April 2026, 01:22 PM ✍️ admin
News Image
99 రోజుల ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లాలోని రఘునాథపల్లి మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల సభను ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ముందుగా రాష్ట్ర గీతాన్ని ఆలపించి, ముఖ్యమంత్రి సందేశాన్ని వినిపించారు.

అనంతరం వివిధ శాఖల అధికారులు వారి పరిధిలో అమలవుతున్న సంక్షేమ పథకాల అమలు తీరును క్షుణ్ణంగా వివరించారు.

రైతు రుణ మాఫీ, రైతు బీమా, ఇందిరమ్మ ఇళ్లు, స్వయం సహాయక సభ్యులకు మంజూరైన వడ్డీ లేని రుణాల వివరాలు, కొత్త రేషన్ కార్డులు, పాస్ బుక్కులు, సన్న బియ్యం పంపిణీ, వైద్య సేవలు, తదితర పథకాలకు సంబంధించి లబ్ధిదారుల పూర్తి వివరాలను మండల ప్రజలకు తెలియజేశారు.

అదే విధంగా నూతన పథకాలైన ముఖ్యమంత్రి అల్పాహారం పథకం, ఇందిరమ్మ జీవిత కుటుంబ బీమా, మధ్యాహ్న భోజన పథకం - ఇంటర్మీడియట్ కు విస్తరణ, విభిన్న ప్రతిభావంత ఇంటర్మీడియట్ విద్యార్థులకు మోటారు వాహనాలు, పంటల వైవిధ్యం, సహజ సేంద్రీయ వ్యవసాయం పథకాలపై అవగాహన కల్పించారు.

ఈ నేపథ్యంలో వివిధ పథకాల లబ్ధిదారులు తమకు అందిన ప్రయోజనాలపై సంతృప్తి వ్యక్తం చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమం వల్ల తమ సమస్యలు పరిష్కారమవుతున్నాయని సంతోషాన్ని పంచుకున్నారు.

ఈ నేపథ్యంలో ప్రజల సమస్యలను కలెక్టర్ ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు.

అనంతరం మండల ప్రజలను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ.... రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని... ప్రతీ గడప కి అందించేందుకు.. జిల్లా యంత్రంగం కృషి చేస్తుందన్నారు

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జనగామ జిల్లా రాష్ట్ర స్థాయిలో టాప్-2లో నిలవడం గర్వకారణమని తెలిపారు.

దీని కోసం ఇంజనీరింగ్ అధికారులు,తహసీల్దార్లు, పంచాయతీ కార్యదర్శులు సమర్థంగా పని చేయడం ముఖ్య కారణమని అభినందించారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల విషయంలో... పెండింగ్ లో ఉన్న ఇళ్లను కూడా వేగవంతంగా పూర్తి చేసి, గృహ ప్రవేశాలు చేసే విధంగా లబ్ధిదారులకు సర్పంచులు పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు.

ఇసుక తరలింపుకి సంబందించి.... పారదర్శకంగా ఆన్లైన్ ద్వారా సరఫరా చేయడం జరుగుతోందని వివరించారు.

రేషన్ కార్డుల దరఖాస్తు, మంజూరు నిరంతర ప్రక్రియ అని, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న అర్హులైన కుటుంబాలకు రేషన్ కార్డులు అందజేయడం జరుగుతుందని తెలిపారు.

మండల సభలో ప్రజలు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, వాటిని సంబంధిత శాఖల అధికారులు నమోదు చేసి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మారుజోడు రాంబాబు, గృహ నిర్మాణ పీడీ మాతృ నాయక్, మండల ప్రత్యేక అధికారి కోదండరాములు, ఎంపిడిఓ శ్రీనివాసులు, తహసీల్దార్ రాజేష్, సర్పంచులు, ఇతర సంబంధిత అధికారులు, సిబ్బంది, మండల ప్రజలు పాల్గొన్నారు.
🏠 Home