Banner
Watermark
ఎయిడ్స్‌పై అవగాహనతోనే నివారణ సాధ్యం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
📅 09 April 2026, 11:04 AM ✍️ admin
News Image
ఎయిడ్స్‌పై అవగాహనతోనే నివారణ సాధ్యం అని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు.

99 రోజుల ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య వారోత్సవాల కింద నాలుగో రోజు ఎయిడ్స్ పై అవగాహన, నివారణ దినోత్సవం సందర్భంగా గురువారం రెడ్ రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరై, ఈ రెడ్ రన్ వాకథాన్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.

ఈ నేపథ్యంలో స్థానిక బస్టాండ్ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు ఎయిడ్స్ నివారణపై తెలంగాణ సాంస్కృతిక కళాకారులచే కళాజాత ద్వారా పాటలు ఆలపించి, అవగాహన కల్పిస్తూ ఈ రెడ్ రన్ వాకథాన్ ర్యాలీని చేపట్టారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఎయిడ్స్ (HIV/AIDS) వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. ఎయిడ్స్ ఒక నివారించలేని (incurable) వ్యాధి అయినప్పటికీ, సరైన జాగ్రత్తలు తీసుకుంటే దీనిని అరికట్టవచ్చని తెలిపారు.

అసురక్షిత లైంగిక సంబంధాలు, సంక్రమిత రక్తం (Infected Blood Transfusion), వాడిన సిరంజీల ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుందని వివరించారు. అందువల్ల ప్రతి ఒక్కరూ సురక్షిత పద్ధతులను పాటిస్తూ, జాగ్రత్తగా ఉండాలన్నారు.

జిల్లాలో కూడా (2040) ఎయిడ్స్ కేసులు నమోదయ్యాయని, ప్రస్తుతం (1342) మంది బాధితులకు జిల్లా కేంద్రంలోని జీజీహెచ్ ఆసుపత్రిలో గల ఏఆర్టీ కేంద్రంలో అవసరమైన చికిత్స అందిస్తున్నామన్నారు. అలాగే జనగామ, ఘనపూర్ (స్టేషన్) లలో ఐసీటీసీ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ మేరకు బాధితులు భయపడకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందాలని సూచించారు.

అదే విధంగా పల్లెల్లో, పట్టణాల్లో ఎయిడ్స్ నివారణపై అవగాహన కల్పించేందుకు కళాజాతలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ప్రజలు ఈ కార్యక్రమాలలో పాల్గొని, వ్యాధి గురించి సరైన సమాచారం తెలుసుకోవాలని కోరారు.

ఎయిడ్స్‌పై అవగాహన పెంపొందించడం ద్వారా సమాజాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోవచ్చని కలెక్టర్ స్పష్టం చేశారు.

ర్యాలీలో వైద్య అధికారులు, ఏఎన్ఎంలు, ఆశాలు, సిబ్బంది, వైద్య విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని, చేతిలో ప్లకార్డులు పట్టుకొని "ఎయిడ్స్ నివారణ" నినాదాలతో ప్రజలకు సందేశం అందించారు.

ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ మల్లికార్జున రావు, డా. అశోక్, ప్రోగ్రామ్ అధికారి (ఎన్టీఈపీ), డా. కమల్ హసన్, డా. శ్రీతేజ, ఏఆర్టీ సెంటర్ వైద్యాధికారులు, ఇతర సంబంధిత వైద్యాధికారులు, ఏఎన్ఎంలు, ఆశాలు, వైద్య విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థులు, ఆరోగ్య శాఖ సిబ్బంది, ఎన్జీఓలు, ట్రాన్స్జెండర్లు, తదితరులు పాల్గొన్నారు.
🏠 Home